గుజరాత్‌లో దారుణం

Garba_Dance

‘గార్భ’  వేడుక చూశాడని దళితుడిని చంపేశారు

8 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

అహ్మదాబాద్‌: ‘గార్భ’ నృత్య వేడుక చూశాడనే ఆగ్రహంతో ఉన్నత స్థాయి పటేల్‌ వర్గీయులు ఓ దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన గుజరాత్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆనంద్‌ జిల్లాలోని భద్రనియా గ్రామంలో పటేల్‌ వర్గీయులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ‘గార్భ’ నృత్య వేడుక చేసుకుంటున్నారు. ఆ వేడుకకు సమీపంలో ఓ ఇంటి దగ్గర దళిత యువకులు జయేశ్‌ సోలంకి, ప్రకాశ్‌ సోలంకి, మరో ఇద్దరు కూర్చున్నారు. అటుగా వచ్చిన పటేల్‌ వర్గీయులు.. ‘గార్భ నృత్యం చూసే హక్కు దళితులకు లేదు’ అని వీరిని బూతులు తిట్టి మరికొందరు పటేల్‌ వర్గీయులను అక్కడికి పిలిచారు. తర్వాత పటేల్‌ వర్గీయులంతా కలసి మూకుమ్మడిగా ఈ దళిత యువకులను చితకబాదారు. ఈ సందర్భంగా జయేశ్‌ తలను గోడకేసి బాదారు. తీవ్రంగా గాయపడిన జయేశ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.

ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై హత్యాచారం, అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. పథకం ప్రకారం హత్య జరిగిందన్న ఆరోపణలను డిప్యూటీ ఎస్పీ(ఎస్సీ, ఎస్టీ సెల్‌) ఏఎం పటేల్‌ తోసిపుచ్చారు.  క్షణికావేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని, రెండు వర్గాల మధ్య ఎటువంటి శత్రుత్వం లేదని వెల్లడించారు. అన్నికోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

మీసాలు పెంచుతారా అంటూ...
మీసాలు పెంచినంత మాత్రాన దళితులు.. రాజ్‌పుత్‌లు కాలేరని హెచ్చరించి దళితులను రాజ్‌పుత్‌లు చితకబాదారు. గత నెల 25, 29వ తేదీల్లో గాంధీనగర్‌ జిల్లా లింబోదారా గ్రామంలో జరిగిన రెండు వేర్వేరు దాడి ఘటనలకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top