తండ్రీకొడుకుల గంజాయి స్మగ్లింగ్‌

Cops Arrested Ganja Smugglers In Warangal Rural - Sakshi

కొడుకుతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

రూ.12లక్షల విలువైన 60 కిలోల శుద్ధి చేసిన గంజాయి స్వాధీనం

సాక్షి, నెక్కొండ: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామానికి చెందిన కొంగర యేసు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం హరిశ్చంద్రు తండా గ్రామానికి చెందిన జాటోతు రాజ్‌కుమార్, జాటోతు సీతారాం(పరారీలో ఉన్నాడు).. పశ్చిమ గోదావరి జిల్లా చింతూరులో గంజాయి కొనుగోలు చేసి స్మగ్లింగ్‌కు చేస్తున్నారు. నిందితుల్లో జాటోతు సీతారాం అక్రమ దందాలకు పాల్పడుతుండేవాడు. ఆయన కుమారుడు, ఎంకాం చదివిన రాజ్‌కుమార్‌ కూడా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి మార్గాన్ని ఎంచుకున్నాడు.

వీరిద్దరితోపాటు మరొకరి సాయంతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడే వారు. ఈ నెల 9న నెక్కొండకు రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేయగా రెండు సంచులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో రాజ్‌కుమార్, యేసును అదుపులోకి తీసుకోగా పక్కనే ఉన్న సీతారాం ఉడాయించాడు. ఈ మేరకు రూ.12 లక్షల విలువైన శుద్ధి చేసిన 60 కిలోల(30 ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి తీసుకొచి్చన గంజాయిని రైలు మార్గంలో మహరాష్ట్రకు తరలించే క్రమంలో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ తిరుమల్, ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై ప్రతాప్‌సింగ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top