
మత్తులో జోగుతున్న రాష్ట్రం
కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా దందా
గంజాయి స్మగ్లింగ్కు గేట్ వేగా ఏపీ
రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రిటైల్ అమ్మకాలు.. పక్కా నెట్వర్క్తో భారీ దోపిడీ
తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా
కళ్లున్న కబోదిలా మారిన ఈగల్ విభాగం
డీ అడిక్షన్ కేంద్రాల పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం
ఇదీ చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
రాష్ట్రంలో ఊరూరా.. వీధి వీధినా.. బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, అది చాలదు.. అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తోంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది.
ఫలితంగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిలిలో బంధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య, స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోళ్లుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్లకు కడుతోంది.
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ స్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపైకి విడిచి పెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ గుప్పుమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్ మారో దమ్.. గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది.
చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్కు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరసి ఆ ముఠా, రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్గా.. యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్చగా దోపిడీకి పాల్పడుతోంది.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి, గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది.
తొలి ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్వర్క్ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది.
తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా
చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచి పెట్టిన మాఫియా.. గత ఏడాది అల్లూరు సీతారామరాజు(ఏఎస్ఆర్) జిల్లాలో దర్జాగా అడుగు పెట్టింది.
ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఊరూ వాడా రిటైల్ విక్రయాలతోపాటు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు హోల్సేల్గా భారీగా స్మగ్లింగ్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.25 వేల కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా రూ.17 వేల కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున రూ.2 వేల కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది.
ఏవోబీలో తలుపులు బార్లా
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా మార్చేసింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది.
ఆపరేషన్ పరివర్తన్ పేరిట రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది.
2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99 శాతం తగ్గిపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది.
ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి.. ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది.
జవసత్వాలు లేని ఈగల్
⇒ గంజాయి, డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెబ్ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్కు పూర్తి స్థాయి చీఫ్గా నిబద్దుడైన వినీత్ బ్రిజ్లాల్ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ అంతగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలిచ్చిన సెబ్ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.
⇒ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనే లేదు. ఈగల్ చీఫ్గా ఆకే రవి కృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్బుక్ కుట్రలకు పావుగా వాడుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం.
⇒ ఈగల్ చీఫ్గా ఉన్న ఆయన్ను కాకికాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంటూ నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం సిట్ ఇన్చార్జ్గా నియమించింది. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట తిరుపతికి చెందిన మదన్ అనే కానిస్టేబుల్పై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్ మదన్ ఫిర్యాదుపై విచారణ అధికారిగా కూడా ఆకే రవి కృష్ణనే ప్రభుత్వం నియమించడం గమనార్హం.
⇒ అంటే ఆయనపై ఇతరత్రా పని భారాన్ని పెంచడం ద్వారా గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై దృష్టి సారించకుండా అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఇప్పటికే గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సమాచారం.
డీ అడిక్షన్ కేంద్రాలకు గ్రహణం
గంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డీ అడిక్షన్ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్ కేంద్రాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటయించగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం అరకొరగానే నిధులు విదిల్చడమే అందుకు నిదర్శనం.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలకు 2021–22లో రూ.3.12 కోట్లు, 2022–23లో రూ.3.99 కోట్లు, 2023–24లో రూ.6.33 కోట్లు చొప్పున వెచ్చించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో కేవలం రూ.1.10 కోట్లే కేటాయించడం గమనార్హం. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.
మూడు రూట్లు.. ఆరు లారీలు...
టీడీపీ మాఫియా తమ ఏజెంట్లను అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోకి పంపించింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిని ఎంపిక చేసుకుని మరీ ఏజెన్సీ ప్రాంతంలో తిష్టవేసేట్టు చేసింది. వారికి ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలను టీడీపీ నేతలే సమకూర్చారు. ఆ ఏజంట్లు ఏఎస్ఆర్ జిల్లాతోపాటు సరిహద్దులకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లోని గంజాయి సాగు చేసేవారితో సంప్రదింపులు జరుపుతూ భారీగా గంజాయి కొనుగోలు చేస్తున్నారు.
దాన్ని యావత్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, కర్ణాటకలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది.
ఈ విషయంపై తెలంగాణ, కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా ఏఎస్ఆర్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి భారీగా అక్రమ రవాణా చేస్తున్న మూడు ప్రధాన మార్గాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో విద్యా సంస్థలే లక్ష్యంగా పచ్చ నెట్వర్క్
అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమ రవాణానే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా రంగంలోకి దిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని టీడీపీ ద్వీతీయ శ్రేణి నేతలతో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలనే గంజాయి విక్రయ మార్కెట్గా చేసుకున్నారు.
అందుకోసం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా వెండర్లను సైతం ఎంపిక చేసుకున్నారు. పాన్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకులు.. ఇలా పలువురిని తమ నెట్వర్క్లో భాగస్వాములుగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి విక్రేతలను స్థానిక పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తుండటం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి వరకు ప్రతి చోటా గంజాయి ప్యాకెట్లను చాకెట్ల మాదిరిగా విక్రయిస్తుండటం విస్మయ పరుస్తోంది.
టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులు
రాష్ట్రంలో టీడీపీ గంజాయి మాఫియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు బరితెగిస్తోంది. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావడం విస్మయ పరుస్తోంది. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం లేని ఆరుగురు యువకులను అక్రమ కేసులో ఇరికించడం ద్వారా టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసుల పన్నాగం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీఐ, బొమ్మూరు ఎస్సై మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తద్వారా టీడీపీ గంజాయి బ్యాచ్ను కాపాడేందుకే పోలీసులు ఇంతగా బరితెగిస్తున్నారన్నది స్పష్టమైంది.
టీడీపీ గంజాయి మాఫియాలో చిన్న మొక్కలివి..
⇒ రాయదుర్గంలో ఓ టీడీపీ నేత తన మామిడి తోటలోనే దర్జాగా గంజాయి సాగు చేశారు.
⇒ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలైంది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు.
⇒ మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో మిత్ అనే పేరుతో చలామణి అయ్యే రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
⇒ మొక్కల లోడ్ ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు.
⇒ సూళ్లూరుపేటలో రూ.3.50 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.