జాతీయ రహదారి పైకి పరుగెత్తుకొచ్చింది..ప్రాణం పోయింది..

Buffalo Rammed On The Road And RTC Bus Dash The Bike Person Dead - Sakshi

సాక్షి, పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మండలంలోని పాతకుప్పెనకుంట్ల సెంటర్‌లోని జాతీయ రహదారిపై గురువారం ఇది జరిగింది. సత్తుపల్లికి చెందిన దారావత్‌ రత్నబాలు(27), షణ్ముఖ శ్రీనివాస్‌ కలిసి బైక్‌పై సత్తుపల్లి నుంచి వియంబంజర్‌ మీదుగా పెనుగంచిప్రోలు వెళుతున్నారు. మార్గమధ్యలోగల మండలంలోని పాత కుప్పెనకుంట్ల సెంటర్‌ వద్ద, ఓ గేదె ఒక్కసారిగా జాతీయ రహదారి పైకి పరుగెత్తుకొచ్చి, బైక్‌ను ఢీకొంది. ఆ వాహనం కింద పడిపోయింది. రోడ్డుపై షణ్ముఖ శ్రీనివాస్, రోడ్డు పక్కన దారావత్‌ రత్నబాలు పడిపోయారు. బైక్‌ వెనుకనే, కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ కొత్తగూడెం డిపో బస్సు వేగంగా వచ్చింది.

అది అదుపుతప్పి, రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొని, రోడ్డు పక్కన పడిపోయిన దారావత్‌ రత్నబాలు మీద నుంచి ముందుకెళ్లి ఆగింది. హెల్మెట్‌ ధరించిన తల పైకి బస్సు టైర్‌ ఎక్కింది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. షణ్ముఖ శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రమాద స్థలాన్ని వియంబంజర్‌ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం రత్నబాలు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top