బీజేపీ నాయకుడి అకృత్యం ; మహిళ బహిర్భూమికి వెళ్లగా..

BJP leader booked for taking women's pics while she defecating in open - Sakshi

గున : అధికార భారతీయ జనతాపార్టీకి చెందిన నాయకుడొకరు ఘోర అకృత్యానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారింది. బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళను ఫొటోలు తీసి, వేధింపులకు గురిచేసిన సదరు నాయకుడిపై ఎట్టకేలకు కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గున జిల్లా కేంద్రానికి చెందిన ప్రదీప్‌ భట్‌ స్థానిక బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అదే ప్రాంతంలో నివసించే ఓ మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో రహస్యంగా ఫొటోలు తీసి, ఆమెను వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఐపీసీ 354సీ, 294 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, వేరొక మహిళను వేధించిన కేసులోనూ ప్రదీప్‌ నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మహిళనే.. ఇప్పుడు ప్రదీప్‌ ఫొటోలు తీశాడు.

ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం పెరిగిందనే మాట ఎలా ఉన్నా, బీజేపీకి చెందిన కొందరు బహిర్భూమికి వెళ్లే మహిళల ఫొటోలను చిత్రీకరించడం, మూత్రవిసర్జన చేసినవారిని అవమానించడం వంటి వికృతచేష్టలకు పాల్పడిన ఘటనలు తరచూ వెలుగుచూస్తుండటం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top