బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

Bike Accident in Prakasam - Sakshi

 ఓ యువకుడు అక్కడికక్కడే మృతి

మరో యువకుడికి తీవ్ర గాయాలు

ప్రకాశం , హనుమాన్‌ జంక్షన్‌ కుంట (పెద్దారవీడు): బైకుపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తోకపల్లె పంచాయతీ హనుమాన్‌జంక్షన్‌ కుంట సిద్దార్థ హైస్కూల్‌ ఎదుట శనివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..హనుమాన్‌జంక్షన్‌ కుంట నుంచి పొలిశెట్టి వెంకటేష్‌ తన బంధువైన శివకుమార్‌తో కలిసి ఎర్రగొండపాలేనికి మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్నారు. తోకపల్లె పంచాయతీ హనుమాన్‌జంక్షన్‌ కుంట సిద్దార్థ హైస్కూల్‌ ఎదుట ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డ్రైవింగ్‌ చేస్తున్న వెంకటేష్‌కు (18) బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

వెనుక కుర్చొన్న శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. రోడ్డు పక్కనే డీప్‌బోరు వేస్తుండగా దుమ్ము గాలికి పైకి లేవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. వెంకటేష్‌ స్నేహితుడు శివకుమార్‌ విజయవాడ నుంచి ఎర్రగొండపాలెం వస్తున్నాడు. కుంట వద్ద దిగాలని చెప్పడంతో శివకుమార్‌ అక్కడ దిగాడు. ఇద్దరూ కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రాజ్‌కుమార్‌ తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు, బంధవులు కన్నీరుమున్నీరయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top