అత్తాకోడళ్ల రగడ విషాదాంతం
నిప్పంటించుకొని ఆత్మహత్య
తుమకూరు వద్ద సంఘటన
కర్ణాటక,తుమకూరు: అన్యోన్యంగా ఉండాల్సిన అత్తాకోడళ్లు క్షణికావేశంలో నిప్పంటించుకుని ప్రాణాలొదిలారు. కోపావేశాలు ఎంత చెడ్డవో ఈ సంఘటన చాటుతోంది. ఈ ఘటన తుమకూరు తాలూకా గంగసంద్రలో చోటు చేసుకుంది. తాలూకాలోని బీరనకల్కు గ్రామానికి చెందిన శివకుమార్ చాలా కాలం క్రితం గంగసంద్ర గ్రామానికి చెందిన రాజేశ్వరి (45)ని వివాహం చేసుకొని గంగసంద్రలోనే ఉంటూ పెయింటర్గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం బీరనకల్కులో ఒంటరిగా ఉంటున్న తల్లి పార్వతమ్మ(75)ను తన ఇంటికి తీసుకొచ్చాడు.
అత్త ఉండడం ఇష్టం లేక
అత్త రావడం ఇష్టంలేని రాజేశ్వరి భర్త శివకుమార్తో రోజూ గొడవపడుతుండేది. ఇదే విషయమై అత్తాకోడలు మధ్య కూడా గలాటాలు జరుగుతుండేవి. సోమవారం కూడా ఇదే విషయమై గొడవపడ్డ అత్తాకోడలు పెయింటింగ్ పనుల కోసం వినియోగించే థిన్నర్ను ఒంటిపై చల్లుకొని నిప్పంటిచుకున్నారు. ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో గమనించిన స్థానికులు వెంటనే ఇంట్లోకి ప్రవేశించి మంటలు ఆర్పడానికి యత్నించగా అప్పటికే అత్తాకోడలు మృతి చెందారు. తుమకూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.