హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ | accused arrest in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Mar 2 2018 10:02 AM | Updated on Aug 20 2018 4:27 PM

accused arrest in murder case - Sakshi

నిందితులను మీడియాకు చూపి వివరాలు వెల్లడిస్తోన్న డీఎస్పీ రవికుమార్‌

గుర్రంపోడు (నాగార్జునసాగర్‌) : హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గుర్రంపోడు మండల పరిధిలోని తెరాటిగూడెంలో ఈ నెల 27న జరిగిన హత్యకేసు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాల నెపంతోనే ఘాతుకానికి ఒడిగట్టారని ఖాకీల విచారణలో వెల్లడైంది. దేవరకొండ డీఎస్పీ రవికుమార్‌ గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.

గ్రామానికి చెందిన పిల్లి సాయన్న తన భార్య యాదమ్మ, కుమారుడు శివ మృతికి కన్నెబోయిన రాములు మంత్రాలు చేయడమే కారణమని అతడిపై కక్ష పెంచుకున్నాడు. గ్రామంలో దారి గుం డా వెళ్తున్న రాములు కుమారుడు రామలింగయ్యను అడ్డగిం చి మీ తండ్రి మం త్రాలు చేస్తున్నాడని, ఎక్కడ దాచా వం టూ ఘర్షణ పడ్డాడు. కత్తితో రామలింగయ్యను పొడవడంతో తప్పించుకుని ఇంటికి బయలు దేరి తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. 

ప్రశ్నించేందుకు వస్తే..
దీంతో తన కుమారున్ని ఎందుకు పొడిచావంటూ ప్రశ్నించేందుకు భార్య పెద్దమ్మ, కుమారుడిని తీసుకుని రాములు ఇంటినుంచి బయలు దేరాడు. దారి లోనే ఎదురైన పిల్లి సాయిలు తమ్ముడు పిల్లి వెంకటయ్య, సాయిలు అల్లుడు కన్నెబోయిన సత్తయ్య, బావమరుదులు కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యలు కలిసి మంత్రాలు చేస్తున్నావంటూ రాములుపై దాడికి పాల్పడ్డారు. గొడ్డళ్లు,రాళ్లు, బండి గడగొయ్యిలు తీసుకుని మూకుమ్మడిగా దాడి చేసి తలపై బండరాళ్లు వేసి హత్య చేశారు.

దాడి సమయంలో కొడుకు రామలింగయ్య తప్పించుకుని పారిపోగా భార్య పెద్దమ్మపై కూడా దాడి చేయడంతో గాయాలయ్యాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నేరస్తులను అరెస్టు చేయడానికి కృషిచేసిన మల్లేపల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ క్రాంతికుమార్‌లను, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందించారు. గ్రా మంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెట్‌ కొనసాగిస్తామని తెలిపారు.

మంత్రాలు, మూఢవిశ్వాసాలు నమ్మవద్దు 
ఆధునిక సమాజంలో శాస్త్రసాంకేతిక రం గంలో దేశం దూసుకువెళ్తున్న ఈ కాలంలో మంత్రాలు, మూఢనమ్మకాలు ఎవరూ నమ్మవద్దని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మూఢనమ్మకాల గురించి గ్రామాల్లో ప్రచార చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలు చేశావంటూ ఎవరిని దూషించినా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement