డిప్రెషన్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ హీరో

Uday Chopra's Health Is Not Ok - Sakshi

సాక్షి,ముంబై: మొహబ్బతే, ధూమ్‌ 3 లాంటి బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన నటుడు, ప్రముఖ నిర్మాత యశ్‌ చోప్రా తనయుడు ఉదయ్‌ చోప్రా మానసిక ఆరోగ్యం బాగోలేదని  తెలుస్తోంది. తాను డిప్రెషన్‌లో ఉన్నానని, ఎంత ప్రయత్నించినప్పటికీ దీన్నుంచి బయటపడలేకపోతున్నాని ఉదయ్‌ చోప్రా ట్వీట్‌ చేశారు. మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోందని, ఆత్మహత్యకు ఇది సరైన దారిగా భావిస్తున్నట్టు ఉదయ్‌ చేసిన కొన్ని ట్వీట్లను అతడి కుటుంబ సభ్యులు తొలగించారు. ఇంతకు ముందు జూన్‌ 2018లో కూడా ఉదయ్‌ ఇలాంటి ట్వీట్లే చేశారు.

డిప్రెషన్‌ (కుంగుబాటు)కు సమాజ బహిష్కరణ, వ్యక్తుల భిన్న ప్రవర్తనలు, ఆహారపు అలవాట్లు, డ్రగ్స్‌ లాంటివే కారణమని.. అలాంటి వారిని అర్థం  చేసుకోవడానికి ప్రయత్నించాలని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘బాలీవుడ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ విభిన్న కలలుంటాయి. నేనూ నంబర్‌ వన్‌ అవ్వాలనుకున్నాను. కానీ నా సరిహద్దులు  ఏంటో నాకు త్వరగానే తెలిశాయ’ని ఉదయ్‌ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో భారత్‌లో గంజాయిను చట్టబద్ధం చేయాలని.. ఈ డ్రగ్‌ను మన సంప్రదాయంలో భాగం చేయాలని, దీని వాడకం ఆరోగ్యానికీ మంచిదని చేసిన పోస్ట్‌ అప్పట్లో దుమారం రేపింది. ఈ ట్వీట్‌తో ముంబై పోలీసులు అతడిపై మండిపడ్డారు. అయితే భారత పౌరుడిగా తన భావాలను అందరితో స్వేచ్ఛగా పంచుకునే హక్కు తనకు ఉందని ఉదయ్‌ ట్వీట్‌ చేశాడు.   

Read latest Celebrities News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top