ముందుముందు మరిన్ని సవాళ్లే! | SBI Annual Report on Banking | Sakshi
Sakshi News home page

ముందుముందు మరిన్ని సవాళ్లే!

Jun 12 2018 12:53 AM | Updated on Jun 4 2019 6:37 PM

SBI Annual Report on Banking - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులకు రానున్న సంవత్సరాలు సవాళ్లమయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2017–18 వార్షిక నివేదిక పేర్కొంది. మొండిబాకాయిల సమస్యల పరిష్కారమే కాకుండా ఇతర అంశాలపైనా దృష్టిపెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. మోసాలు, సైబర్‌ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల్లో పటిష్టత, వినియోగ సేవల పెంపు, మానవ వనరులు వంటివి ఇందులో ఉన్నాయి. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...

నిర్వహణాపరమైన అంశాలు క్లిష్టంగా మారాయి. ఆయా అంశాలపై రానున్న కాలంలో మరింత దృష్టి పెట్టాలి.
 మొండిబకాయిలు, ఒత్తిడిలో ఉన్న రుణ వసూళ్ల సమస్యలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. అయితే తగిన ఫలితాలను చూడ్డానికి మరింత సమయం పడుతుంది.  
 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం తాజా మూలధనం అందించడం సానకూల అంశమే. అయితే దీనివల్ల ఎంత ప్రయోజనం లభిస్తుందన్న అంశం పలు అంశాల ప్రాతిపదికగా ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకోవడం, సాంకేతికత వినియోగం, ఎన్‌పీఏల పరిష్కారం వంటివి ఇక్కడ పరిశీలనార్హం.  
 2017–18 బ్యాంకింగ్‌ నికర లాభాలకు సంబంధించి ఎంతో క్లిష్టమైనది. ప్రొవిజనింగ్, గవర్నమెంట్‌ బాండ్లపై మార్క్‌ టూ మార్కెట్‌ నష్టాలు పెరగడం, ఉద్యోగులకు వేతనాలు వంటి సవాళ్లను బ్యాంకింగ్‌ ఎదుర్కొంది. పలు బ్యాంకులు ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల్లో (పీసీఏ)కి వెళ్లడం ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం.  
  ఇక వృద్ధి బాగున్నప్పటికీ, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఉంది. ముఖ్యంగా ‘వాణిజ్య యుద్ధం’ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు తమ విదేశీ వాణిజ్య వ్యూహాన్ని ‘ఇబ్బందులకు’ లోబడి పునఃరూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. భారత్‌ బ్యాంకులూ ఇందుకు అతీతం కాదు.  
  వచ్చే రెండేళ్లలో 10 నుంచి 12 శాతం రుణ వృద్ధి నమోదయ్యేలా ఎస్‌బీఐ ఒక వ్యూహాన్ని రూపొందిస్తోంది.  
 బ్యాంకింగ్‌ పరిశ్రమలో గత ఏడాది ఎదురయిన అనుభవాల దృష్ట్యా, అంతర్గత ఆడిట్, నియంత్రణ వ్యవస్థలను మెరుగుపరచుకోవడంపై ఎస్‌బీఐ దృష్టి సారిస్తోంది.  
 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు దాదాపు రూ.11.5 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. ఈ బ్యాంక్‌లు ఇచ్చిన మొత్తం రుణాల్లో ఇది దాదాపు 14 శాతానికి సమానం.

బడా రుణ గ్రహీతల రుణాలకు ఆర్‌బీఐ ముసాయిదా!
కాగా, బడా రుణ గ్రహీతలకు రుణ మంజూరీల విషయంలో ప్రమాణాల పటిష్టతపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి సోమవారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement