జియోలో వాటా కొనుగోలు చేసిన జీఏ
జియోలో రూ. 6549 కోట్ల పెట్టుబడి
ముంబై : రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా జియోలో అమెరికన్ కంపెనీ రూ 6549 కోట్లు వెచ్చించనుంది. గత నాలుగు వారాల్లో ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ వంటి టెక్ దిగ్గజాల నుంచి జియో రూ 67,194 కోట్లు సమీకరించింది.
భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు డిజిటల్ కనెక్టివిటీ కీలకమనే ముఖేష్ అంబానీ విజన్ను తాము పంచుకుంటున్నామని, భారత్లో డిజిటల్ విప్లవానికి ముందుండి చొరవ చూపిన జియోతో కలిసి పనిచేస్తామని జనరల్ అట్లాంటిక్ సీఈఓ బిల్ పోర్డ్ అన్నారు. ఇక ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులతో భారత్లో డిజిటల్ సొసైటీని పటిష్టపరిచేందుకు మార్గం సుగమం అవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది.