జియో డేటా స్పీడు దారుణం! | Reliance Jio 4G Internet Slowest in India, Shows Trai Data | Sakshi
Sakshi News home page

జియో డేటా స్పీడు దారుణం!

Oct 22 2016 12:00 AM | Updated on Sep 4 2017 5:54 PM

జియో డేటా స్పీడు దారుణం!

జియో డేటా స్పీడు దారుణం!

‘4జీ టెక్నాలజీతో దేశంలో డేటా విప్లవాన్ని సృష్టిస్తాం. వేగవంతమైన డేటా సేవలు అందిస్తాం’ అంటూ టెలికం రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన రిలయన్స్ జియో ప్రకటనలు...

టాప్-5 సంస్థల్లో అతి తక్కువ వేగం దీనిదే
ట్రాయ్ పరీక్షల్లో వెల్లడైన వాస్తవం
సేవల వేగంలో ఎయిర్‌టెల్ టాప్

 న్యూఢిల్లీ: ‘4జీ టెక్నాలజీతో దేశంలో డేటా విప్లవాన్ని సృష్టిస్తాం. వేగవంతమైన డేటా సేవలు అందిస్తాం’ అంటూ టెలికం రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన రిలయన్స్ జియో ప్రకటనలు... ఆచరణలో అంతంతమాత్రమేనని తేలుతోంది. 4జీ టెక్నాలజీ అంటేనే వేగంతో కూడుకున్నది కనుక జియో ప్రకటనలను కస్టమర్లు పూర్తిగా విశ్వసించారు. ‘90 రోజుల పాటు జియో సేవల అనుభవాన్ని ఉచితంగా, అపరిమితంగా ఆస్వాదించండంటూ’ చేసిన ప్రకటన చూసి త్రీజీ ఫోన్లను ఎక్స్‌చేంజ్ చేసుకునో, పక్కన పడేసో 4జీ ఫోన్లకు మారిపోయిన వారు ఎందరో!!.

కానీ ఆచరణలోకి వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో డేటా స్పీడు వేగంగా లేదు. సరికదా దారుణంగా ఉంది. స్పీడు సంగతి పక్కనబెడితే చాలా ప్రాంతాల్లో అసలు కనెక్టివిటీనే లేదు. 5 ప్రధాన టెల్కోల 4జీ డేటా వేగాన్ని పరీక్షించగా  ఆఖరి స్థానంలో ఉన్నది జియోనేనని సాక్షాత్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’... డేటా పరీక్షలు నిర్వహించి మరీ తేల్చింది. దీని ప్రకారం...

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, ఆర్‌కామ్, రిలయన్స్ జియోకు చెందిన 4జీ డేటా సేవల వేగాన్ని ట్రాయ్ పరీక్షించి చూసింది. వీటిలో జియో డేటా సేవల వేగం మిగిలిన సంస్థల సేవల కంటే మెల్లగా ఉంది. 4జీ సేవల వేగంలో అన్నింటికంటే ముందు ఎయిర్‌టెల్ నిలిచింది.

ఎయిర్‌టెల్ 4జీ వేగం సెకనుకు 11.4 మెగాబైట్స్ (ఎంబీపీఎస్) ఉంది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ 4జీ సేవల వేగం 7.9 ఎంబీపీఎస్‌గా ఉంది. ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ సేవలు 7.3 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు ట్రాయ్ గుర్తించింది. ఇక  జియో 4జీ డేటా సేవల వేగం సెకనుకు 6.2 ఎంబీపీఎస్‌గా ఉందని వెల్లడైంది.

విభేదించిన జియో: ట్రాయ్ గణాంకాలతో జియో విభేదించింది. ట్రాయ్ అనలిటిక్స్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న గణాంకాల తర్వాత తాము సైతం అంతర్గతంగా పరీక్షించి చూశామని... జియో వేగాన్ని ఇతర ఆపరేటర్లతో ఏకపక్షంగా పోల్చి చూసినట్టు తాము భావిస్తున్నామని జియో ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుడి రోజువారీ పారదర్శక వినియోగం (ఎఫ్‌యూపీ) పరిమితి 4జీబీ పూర్తయిన తర్వాత వేగాన్ని పరీక్షించి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. ఈ పరిమితి తర్వాత వేగం 256 కేబీపీఎస్‌కు పడిపోతుందని తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement