ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు.. | Nitin Gadkari formally inaugurates the Auto Expo 2020 | Sakshi
Sakshi News home page

ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..

Feb 7 2020 5:00 AM | Updated on Feb 7 2020 5:04 AM

Nitin Gadkari formally inaugurates the Auto Expo 2020 - Sakshi

గ్రేటర్‌ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్‌ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. విద్యుత్‌ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్‌ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను.

వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్‌ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్‌ వన్‌ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్‌టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్‌టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు.

‘శాంత్రోవాలా’.. షారుఖ్‌..
దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.


గ్రేట్‌ వాల్‌ మోటర్స్‌ ఉత్పత్తి హవల్‌ ఎఫ్‌5 ఎస్‌యూవీతో మోడల్స్‌


ఫోక్స్‌వ్యాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘ఐడీ క్రాజ్‌’తో సంస్థ ప్రతినిధులు


జేకే మోటర్‌ స్పోర్ట్స్‌ పెవిలియన్‌లో రేసింగ్‌ కారుతో మోడల్స్‌


ఆటో ఎక్స్‌పోలో సుజుకీ హయబుసా బైక్‌తో మోడల్‌

Advertisement
 
Advertisement
Advertisement