బన్సల్‌ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

బన్సల్‌ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ

Published Wed, Sep 19 2018 12:15 AM

nfosys loses Rajiv Bansal severance pay plea case - Sakshi

న్యూఢిల్లీ: మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) రాజీవ్‌ బన్సల్‌కి పరిహారం వివాదంపై ఆర్బిట్రేషన్‌ కేసులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు రూ. 12.17 కోట్ల బకాయిని వడ్డీతో పాటు చెల్లించాల్సిందేనని ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ స్పష్టం చేసింది. బన్సల్‌ ఇప్పటికే తీసుకున్న రూ. 5.2 కోట్ల మొత్తాన్ని వాపసు చేయాలన్న సంస్థ అభ్యర్థనను ప్యానెల్‌ తిరస్కరించిందని బీఎస్‌ఈకి ఇన్ఫీ తెలియజేసింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రతించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది.

ఇన్ఫోసిస్‌ గత యాజమాన్యం, వ్యవస్థాపకుల మధ్య చిచ్చు రేపిన అంశాల్లో బన్సల్‌ పరిహారం కూడా ఒకటి కావడం గమనార్హం. 2015లో రాజీవ్‌ బన్సల్‌ ఇన్ఫోసిస్‌ నుంచి వైదొలిగినప్పుడు.. ఆయనకు పరిహారం కింద 24 నెలల జీతం లేదా రూ. 17.38 కోట్లు ఇచ్చేందుకు ఇన్ఫీ అంగీకరించింది. దీని ప్రకారం ముందుగా రూ. 5 కోట్లు చెల్లించింది. అయితే, ఈ డీల్‌పై సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తదితరులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. మిగతాది చెల్లించకుండా నిలిపివేసింది. ఈ వివాదంతో ఇన్ఫోసిస్‌పై బన్సల్‌ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ను ఆశ్రయించగా.. తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement