భారీ క్రెడిట్‌ కార్డు మోసం : కోట్లు కొల్లగొట్టారు

Massive Credit Card Fraud At Citi Bank's CP Branch - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ క్రెడిట్‌ కార్డు మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నాట్‌ ప్లేస్‌ బ్రాంచ్‌లో ఉన్న సిటీ బ్యాంక్‌లో ఈ మోసం జరిగింది. మోసగాళ్లు సేవింగ్స్‌ అకౌంట్లు ఓపెన్‌చేసి, ఆ తర్వాత క్రెడిట్‌ కార్డులు పొంది, వాటిని ఫుల్‌గా వాడేసుకుని బిల్లులు చెల్లించుకుండా పారిపోయారు. ఇలా బ్యాంక్‌కు రూ.2.4 కోట్ల క్రెడిట్‌ కార్డుల బకాయిలను చెల్లించలేదు. ఇలాంటివి మొత్తం 36 కేసులు నమోదైనట్టు అమెరికాకు చెందిన సిటీ బ్యాంక్ సీపీ బ్రాంచ్‌ తెలిపింది. తప్పుడు అడ్రస్‌లతో కస్టమర్లు క్రెడిట్‌ కార్డులు పొందారని, ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో వీరు ఈ కార్డులను స్వైప్‌ చేసినట్టు పేర్కొన్నారు. 35 మంది 15 మంది కార్డులపై రుణాలు కూడా పొందినట్టు రిపోర్టులు వెల్లడించాయి. దీనిపై సిటీ బ్యాంక్‌ అధికారులు ఢిల్లీ పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేసింది.

‘ప్రభుత్వం ఆమోదించిన ఐడెంటీ డాక్యుమెంట్లు ఆధార్‌, ప్యాన్‌, ఓటర్‌ ఐడీ కార్డులతో వారు క్రెడిట్‌ కార్డులను పొందారు. బ్యాంక్‌ అంతర్గత విచారణలో 36 అకౌంట్లలో 16 అకౌంట్లను నలుగురు వ్యక్తులే తెరిచినట్టు వెల్లడైంది’ అని సిటీ బ్యాంక్‌ నార్త్‌ జోన్‌ మేనేజర్‌ హితేష్‌ వర్మ తెలిపారు. ఈ నలుగురు అకౌంట్‌ హోల్డర్స్‌ కూడా ఒకే నివాసా చిరునామాను అందించారని సిటీ బ్యాంక్‌ తెలిపింది. 36 మందిలో 11 మంది తాత్కాలిక క్రెడిట్‌ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసినట్టు పేర్కొంది. తాత్కాలిక క్రెడిట్‌ సౌకర్యమనేది క్రెడిట్‌ కార్డు లేదా బ్యాంక్‌ ఖాతా ద్వారా జరిపిన లావాదేవీలు ఏమైనా వివాదాస్పదమైతే, బ్యాంక్‌ ద్వారా జారీ చేసే క్రెడిట్‌ సిస్టమ్‌.  36 మంది కస్టమర్లలో 33 మంది కస్టమర్లు వారిచ్చిన రెసిడెన్స్‌ అడ్రస్‌లలో అసలు వారి నివసించడం లేదని తెలిసింది. నలుగురు రాణి బాగ్‌లో ఉంటున్న ఆఫీసు అడ్రస్‌లను ఇచ్చారు. ఆఫీసు పేరును మార్చి ఇచ్చారు. మొత్తం ఈ కార్డులపై రూ.2.14 కోట్ల మోసం జరిగింది. ఒక్కో కార్డుపై రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మోసం జరిగినట్టు తెలిసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top