మిశ్రమంగా ఆటో అమ్మకాలు | Kerala floods hit passenger vehicle sales in August | Sakshi
Sakshi News home page

మిశ్రమంగా ఆటో అమ్మకాలు

Sep 3 2018 1:50 AM | Updated on Sep 3 2018 1:50 AM

Kerala floods hit passenger vehicle sales in August - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థల వాహనాల విక్రయాలు ఆగస్టులో మిశ్రమంగా నమోదయ్యాయి. దేశీయంగా మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌ అమ్మకాలు తగ్గగా.. టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహనాల విక్రయాలు పెరిగాయి. కేరళలో వరదల పరిస్థితి వాహనాల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఆగస్టులో దేశీయంగా మారుతీ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) 2.8 శాతం క్షీణించి 1,52,000 నుంచి  1,47,700 యూనిట్లకు తగ్గాయి. 

అటు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు కూడా దాదాపు 2.8% 47,103 యూనిట్లకు క్షీణించాయి. గతేడాది ఆగస్టులో హ్యుందాయ్‌ 45,801 కార్లను విక్రయించింది.  టాటా మోటార్స్‌ వాహనాల అమ్మకాలు మాత్రం 28 శాతం పెరిగి 14,340 యూనిట్ల నుంచి 18,420 యూనిట్లకు, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎంఅండ్‌ఎం విక్రయాలు 15 శాతం వృద్ధితో 39,615 నుంచి  45,373 యూనిట్లకు చేరాయి. 

ఫోర్డ్‌ ఇండియా అమ్మకాలు 7,777 యూనిట్ల నుంచి 8,042 పెరగ్గా, హోండా కార్స్‌ ఇండియా ఆగస్టులో 17,020 కార్లను విక్రయించింది. ద్విచక్ర వాహనాల విభాగంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ దేశీయ అమ్మకాలు 2 శాతం వృద్ధితో 2,70,544 నుంచి 2,75,688కి చేరాయి.   హీరో మోటోకార్ప్‌ విక్రయాలు 0.92 శాతం పెరిగాయి. మొత్తం 6,85,047 మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు విక్రయించింది. గతేడాది ఆగస్టులో సంస్థ మొత్తం 6,78,797 యూనిట్లు విక్రయించింది.

అశోక్‌లేలాండ్‌ అమ్మకాలు 27 % అప్‌
హిందూజా గ్రూపునకు చెందిన ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ వాహన అమ్మకాలు 27% పెరిగాయి. ఆగస్టులో 17,386 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 13,637 యూనిట్లను విక్రయించి ంది. మధ్య, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో 24 శాతం వృద్ధిరేటును సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement