మే నెల అమ్మకాల్లో కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదల సవాలుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మే నెలలో వాహన విక్రయాలు జోరుగా కొనసాగాయి. మారుతీ సుజుకీ ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1,93,535 యూనిట్ల అత్యుత్తమ నెలవారీ అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది(2025) ఇదే నెలలో జరిగిన 1,38,690 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే వృద్ధి 40 శాతం అధికంగా ఉంది. కియా ఇండియా భారత మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత మే నెలలో అత్యధిక విక్రయాలు సాధించి రికార్డు నెలకొల్పింది.
గడిచిన నెల(మే)లో 23% వృద్ధితో 27,586 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. ద్విచక్ర వాహన రంగంలో హెచ్ఎంఎస్ఐ, టీవీఎస్ మోటార్స్ భారీ అమ్మకాలతో తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయి. ఇదే జోష్ను కొనసాగిస్తూ వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విక్రయాలు కూడా మే నెలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ధరల భారం కారణంగా చిన్న కార్ల కొనుగోళ్లు కొంత మందగించినా.. ప్రత్యామ్నాయంగా ఈవీ (ఎలక్ట్రిక్), సీఎన్జీ వాహనాలకు బుకింగ్లు గణనీయంగా పెరగడం విశేషం.


