దసరా టు దీపావళి జియో బంపర్‌ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

దసరా టు దీపావళి జియో బంపర్‌ ఆఫర్‌

Published Mon, Oct 7 2019 2:41 PM

Jio Phone to sell for Rs 699 during Dussehra to Diwali offer, Rs 99 worth of free internet also in the offing - Sakshi

సాక్షి, ముంబై: భారతీయ టెలికాం రంగంలో 4జీ టెక్నాలజీతో సంచలనాలకు మారు పేరుగా మారిన రిలయన్స్ జియో ఇప్పుడు 2జీ మార్కెట్‌పై కన్నేసింది. 2జీ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లను విరివిగా అందుబాటులోకి తేవాలని  లక్ష్యంగా  పెట్టుకుంది.  ఇందులో భాగంగా `జియో ఫోన్ దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌` పేరుతో కొత్త ఆఫర్‌ను జియో నేడు ప్ర‌క‌టించింది.  జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం క‌లిపి రూ.1500 భారీ ప్ర‌యోజ‌నం ప్ర‌తి జియో ఫోన్ వినియోగ‌దారుడికి సొంతం అవుతుంది. ఈ దసరా  టూ దివాలీ  ఆఫర్‌  రేపు (అక్టోబర్‌ 8)  ఈ నెల 27వరకు మాత్రమే అందుబాటులో వుంటుందని జియో ప్రకటించింది. 

ద‌స‌రా, దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో, జియో ఫోన్ ప్ర‌స్తుత ధ‌ర రూ.1500 కాకుండా ప్ర‌త్యేక ధ‌ర కింద‌ కేవ‌లం రూ. 699కే జియో ఫోన్ అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే.  మ‌రో ప్ర‌త్యేక‌త‌ ఏంటంటే ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 2జీ ఫీచ‌ర్ ఫోన్ల కంటే కూడా ఈ ధ‌ర ఎంతో త‌క్కువ కావ‌డం విశేషం. అంతేకాదు పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవ‌డం వంటి ప్ర‌త్యేకమైన ష‌ర‌తులు ఏవీ కూడా విధించ‌క‌పోవ‌డం దీనియొక్క మ‌రో ప్ర‌త్యేక‌త‌. త‌ద్వారా, ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు శ‌క్తివంత‌మైన 4జీ సేవ‌ల‌ను అందించనుంది. రూ.700కు సంబంధించి, జియో ఫోన్ వినియోగ‌దారులు ఆ మొత్తంతో జియో ఫోన్ కొనుగోలు చేసి 2జీ నుంచి 4జీ డాటా ప్ర‌పంచంలోకి మారిపోవ‌చ్చు. రూ.700 విలువైన డాటా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తోంది. వినియోగ‌దారుడు చేసుకున్న మొద‌టి ఏడు రీచార్జ్‌ల‌కు రూ.99 విలువైన డాటాను జియో అధ‌నంగా జ‌త‌చేయ‌నుంది. జియోఫోన్ వినియోగ‌దారుల‌కు అధ‌నంగా అందే ఈ రూ.700 డాటాతో జియో వినియోగ‌దారులు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పేమెంట్స్‌, ఈకామ‌ర్స్‌, విద్య, శిక్ష‌ణ‌, రైలు, బ‌స్ బుకింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మ‌రెన్నో అంశాల‌కు సంబంధించిన మునుపెన్న‌డూ లేని అనుభూతుల‌ను సొంతం చేసుకోవ‌చ్చని జియో తెలిపింది. 

డిజిట‌ల్ ఇండియా క‌ల సాకారం చేసుకోవ‌డంలో భాగంగా జియో అందిస్తున్న దీపావ‌ళి కానుక‌. ఈ పండుగ మాసంలో జియో ద్వారా అందించే ఒక్కసారి మాత్రమే ల‌భ్య‌మ‌య్యే ఈ ఆఫ‌ర్‌ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, భార‌త‌దేశంలో 2జీ సేవ‌లను వినియోగిస్తున్న వారు దాని నుంచి అప్‌గ్రేడ్ అయి జియో ఫోన్ ప్లాట్‌ఫాంకు చేరువ కావాల‌ని జియో ప్రకటించింది. 

Advertisement
Advertisement