మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకు | India ranks 44th in intellectual property index | Sakshi
Sakshi News home page

మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకు

Feb 9 2018 1:03 AM | Updated on Feb 9 2018 1:03 AM

India ranks 44th in intellectual property index - Sakshi

వాషింగ్టన్‌: అంతర్జాతీయ మేధోహక్కుల (ఐపీ) సూచీలో భారత్‌ ర్యాంకింగ్‌ కొంత మెరుగుపడింది. 50 దేశాల జాబితాలో 44వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 45 దేశాల సూచీలో భారత్‌కు 43వ ర్యాంకు దక్కింది. స్కోరు కొంత మెరుగుపడినప్పటికీ .. ఈ సూచీలో భారత్‌ ఇంకా అట్టడుగు స్థానంలోనే ఉంది. అమెరికా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌లో భాగమైన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పాలసీ సెంటర్‌ (జీఐపీసీ) రూపొందించిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు గాను... విధానాలకు అనుగుణంగా భారత్‌ మరిన్ని అర్ధవంతమైన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అభిప్రాయపడింది. భారత్‌ గతేడాది కంప్యూటర్‌ ఆధారిత నవకల్పనలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. నూతన సాంకేతిక ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చేలా ఉన్నాయని పేర్కొంది. అలాగే మేధోహక్కులపై అవగాహన పెంచేందుకు వర్క్‌షాపులు నిర్వహించడం, సాంకేతికాంశాల్లో శిక్షణనివ్వడం మొదలైనవి భారత్‌కు సానుకూలాంశాలని తెలిపింది. మేధోహక్కుల సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా .. బ్రిటన్, స్వీడన్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement