త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు! | ICIA Changed to ACMAI Soon | Sakshi
Sakshi News home page

త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు!

Aug 23 2019 9:13 AM | Updated on Aug 23 2019 9:13 AM

ICIA Changed to ACMAI Soon - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న వీవీఎస్‌ జగన్‌మోహన్‌ రావు. చిత్రంలో కృష్ణప్రసాద్‌ ఆచార్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)గా ఉన్న చార్టెర్డ్‌ అకౌంటింగ్స్‌ బాడీ.. త్వరలోనే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ)గా మారనుంది. దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేక పార్లమెంటరీ చట్టాన్ని రూపొందిస్తోందని సౌత్‌ ఏషియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఎస్‌ఏఎఫ్‌ఏ) ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పీవీఎస్‌ జగన్‌మోహన్‌ రావు తెలిపారు. 1949లో చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ యాక్ట్‌ కింద ఐసీఏఐను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 80 వేలకు పైగా సభ్యులున్నారు. గురువారమిక్కడ ఎస్‌ఏఎఫ్‌ఏ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీల అకౌంటింగ్, ఆడిటింగ్, ఎథిక్స్‌ విభాగాల్లో ఎస్‌ఏఎఫ్‌ఏ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎనిమిది సార్క్‌ దేశాల్లో అకౌంటింగ్, కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫిషనల్స్‌ తయారీ, నిర్వహణ వంటి వాటిల్లో ఎస్‌ఏఎఫ్‌ఏ పనిచేస్తుందని.. నేపాల్, ఆప్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవుల్లో కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ బాడీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఎస్‌ఏఎఫ్‌ఏలో 3.50 లక్షల మంది సభ్యులున్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫౌండేషన్‌ డేను నిర్వహిస్తామని, ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుందని’’ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ నేపాల్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ ప్రసాద్‌ ఆచార్య, సార్క్‌ దేశాల నుంచి 150 మంది సీఏలు, సీఎంఏలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement