టెలికం కంపెనీలకు భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

టెలికం కంపెనీలకు భారీ షాక్‌

Published Thu, Oct 24 2019 2:50 PM

 Huge setback for telcos as Supreme Court asks them to pay Rs 92,000 cr to govt - Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ టెలికం కంపెనీలకు భారీ షాక్‌​ తగిలింది.  చార్జీల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్‌) నిర్దేశించిన అడ్జెస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ ( ఏజీఆర్‌\) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీం గురువారం తీర్పుచెప్పింది.  దీనికి డాట్‌ విధించిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పింది. టెల్కోలు లేవనెత్తిన అంశాలను పనికిరానివని కొట్టిపారేయడమే కాకుండా.. వడ్డీ తో సహా జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది.  న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా, ఏఏ నజీర్‌, ఎంఆర్‌షాలతోకూడిన సుప్రీం ధర్మాసంన ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఏజీఆర్‌ ఫీజుపై మొబైల్‌ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సాగిన 14 సంవత్సరాల న్యాయ పోరాటం ముగిసింది. 

అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ .92,642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, అందులో సగానికి పైగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ చెల్లించాల్సి ఉంది. డాట్‌ లెక్కల ప్రకారం భారతి ఎయిర్‌టెల్ రూ .21,682 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .28,309 కోట్లు, ఎమ్​టీఎన్​ఎల్​ రూ.2 వేల 537 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. డాట్‌ రూల్స్‌‌ ప్రకారం అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌) లో ఎనిమిది శాతం లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. ఏజీఆర్‌ స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్సింగ్ ఫీజులుగా విభజించారు. ఐదుశాతం ఎస్‌యూసీతోపాట, ఎక్కువ స్పెక్ట్రాన్ని సేకరించిన మొబైల్‌ సంస్థ ఓటీఎస్‌సీ కూడా చెల్లించాలి. ఒక్కో సర్కిల్‌ లో 4.4 మెగాహెజ్‌ ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్‌ ధరలు చెల్లించాల్సిందే!  మరోవైపు  ఈ  తీర్పుతో భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ షేర్లు 4.9 శాతం, వోడాఫోన్ ఐడియా 13.3 శాతం పతనాన్ని నమోదు చేసాయి.

Advertisement
Advertisement