6 నెలల్లో రూ. 120 కోట్ల పసిడి లావాదేవీలు

Gold and 120 million transactions in 6 months

ధంతెరాస్‌ రోజున 12% ఎగిసిన అమ్మకాలు

మొబైల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం వెల్లడి  

న్యూఢిల్లీ: మొబైల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం తమ ప్లాట్‌ఫామ్‌పై గడిచిన ఆరు నెలల్లో రూ.120 కోట్ల విలువ చేసే పసిడి విక్రయ లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించింది. ధంతెరాస్‌ రోజున పసిడి అమ్మకాలు ఏకంగా 12 శాతం పెరగ్గా, కొనుగోలుదారుల సంఖ్య పది లక్షల స్థాయి దాటిందని తెలిపింది. ‘పేటీఎం గోల్డ్‌ అమ్మకాల్లో దాదాపు 60 శాతం.. చిన్న పట్టణాల నుంచే నమోదయ్యాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో గరిష్టంగా డిమాండ్‌ కనిపించింది‘ అని వివరించింది. కస్టమర్లలో చాలా మంది సగటున రూ.500 విలువ చేసే పసిడి కొనుగోలు చేసినట్లు పేర్కొంది.

70 శాతం మంది కస్టమర్లు మిలీనియల్సే (1982– 2004 మధ్య పుట్టినవారు) ఉన్నారని, కస్టమర్లు దీర్ఘకాలిక పొదుపు కోసం పేటీఎం గోల్డ్‌ను ఎంచుకుంటున్నారనడానికి ఇది నిదర్శనమని పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ మిశ్రా చెప్పారు. ఎంఎంటీసీ –పీఏఎంపీతో చేతులు కలిపిన పేటీఎం ఆరు నెలల క్రితం తమ ప్లాట్‌ఫాంపై ఆన్‌లైన్‌లో పసిడి విక్రయాలు ప్రారంభించింది. దీని ద్వారా కొనుగోలు చేసిన 24 క్యారట్స్‌ బంగారాన్ని కస్టమర్లు ఎంఎంటీసీ–పీఏఎంపీ లాకర్స్‌లో ఎలాంటి అదనపు చార్జి లేకుండా భద్రపర్చుకోవచ్చు. కావాలనుకుంటే నాణేల రూపంలో ఇంటికి తెప్పించుకోవచ్చు లేదా ఆన్‌లైన్లోనే మార్కెట్‌ ఆధారిత ధరకు మళ్లీ ఎంఎంటీసీ–పీఏఎంపీకే విక్రయించవచ్చు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top