ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

This Fiscal Year L&T Profits 1,473 Crore - Sakshi

క్యూ1లో 21 శాతం వృద్ధి

ఆదాయం రూ. 29,636 కోట్లు..

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌ దిగ్గజం, ఎల్‌ అండ్‌ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,473 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,215 కోట్లతో పోల్చితే 21% వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. నికర అమ్మకాలు 27,005 కోట్ల నుంచి కోట్ల నుంచి 10% వృద్ధితో రూ.29,636 కోట్లకు పెరిగాయని ఎల్‌అండ్‌టీ సీఈఓ ఆర్‌.శంకర్‌ రామన్‌ చెప్పారు. వ్యయాలు రూ.25,216 కోట్ల నుంచి రూ.27,365 కోట్లకు పెరిగాయని తెలిపారు. 

నిర్వహణ లాభం 20 శాతం అప్‌...
మొత్తం ఆదాయంలో దాదాపు సగం ఉండే మౌలిక రంగ సెగ్మెంట్‌ ఆదాయం 14% ఎగసి రూ.14,038 కోట్లకు పెరిగిందని రామన్‌ తెలిపారు. నిర్వహణ లాభం 20 శాతం వృద్ధితో రూ.3,319 కోట్లకు పెరిగిందని, నిర్వహణ లాభ మార్జిన్‌ 1% పెరిగి 11.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు.

11 శాతం పెరిగిన ఆర్డర్లు....
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో తమ గ్రూప్‌ కంపెనీలన్నీ కలసి రూ.38,700 కోట్ల ఆర్డర్లు సాధించాయని రామన్‌ వెల్లడించారు. ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందాయని పేర్కొన్నారు.  ఇక ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మొత్తం ఆర్డర్లు రూ.2,94,014 కోట్లకు చేరాయని, వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 21 శాతమని పేర్కొన్నారు.

క్యూ2 నుంచి మైండ్‌ట్రీ.....
ఈ ఏడాది జూన్‌ నాటికి మైండ్‌ట్రీ కంపెనీలో తమకు 28.86 శాతం వాటా ఉందని, ఈ క్వార్టర్‌ పూర్తయిన తర్వాత ఆ కంపెనీలో తమ వాటా 60.59 శాతానికి చేరిందని రామన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ నుంచి తమ అనుబంధ సంస్థగా మైండ్‌ట్రీ కొనసాగుతుందని వివరించారు.మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ షేర్‌0.4% లాభంతో రూ.1,410 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top