సినిమా చూశాకే టికెట్‌ కొనండి!

సినిమా చూశాకే టికెట్‌ కొనండి!

పీవీఆర్‌తో ఒప్పందం చేసుకున్న ఈపే లేటర్‌
► క్రెడిట్‌పై రైలు టికెట్ల బుకింగ్‌ కోసం ఆర్‌సీటీసీతో కూడా
►  నగదు చెల్లింపులకు 14 రోజుల గడువు; డీఫాల్టయితే నెలకు 3% పెనాల్టీ
►  ఏడాదిలో బస్సు, విమాన టికెట్లు కొనుగోలు సౌకర్యం కూడా..
► ఇప్పటివరకు రూ.13 కోట్ల నిధుల సమీకరణ
► ‘స్టార్టప్‌ డైరీ’తో ఈపే లేటర్‌ కో–ఫౌండర్‌ భట్టాచార్య  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మనకు తెలిసిందల్లా సినిమాకెళ్లాలంటే ఆన్‌లైన్‌లోనో లేక థియేటర్‌ కౌంటర్‌లోనో టికెట్‌ కొని వెళ్లడం. కానీ, ఇపుడు మరో కొత్త సౌకర్యమూ అందుబాటులోకి వచ్చిందండోయ్‌!! టికెట్‌ అవసరం లేకుండా ముందైతే సినిమా చూసేయండి.. ఆ తర్వాతే టికెట్‌ ధర చెల్లించమంటోంది ‘ఈపే లేటర్‌’ సంస్థ. ఒక్క సినిమానే కాదు... రైలు ప్రయాణం, గ్రాసరీ, షాపింగ్, టూరిజం ట్రావెల్‌ ఇలా అన్ని రకాల సేవలకూ ఇదే మంత్రమంటోంది. దీనికోసం ఐఆర్‌సీటీసీ, పీవీఆర్, ఇండియామార్ట్, జాప్‌నౌ, గుడ్‌బాక్స్, ఈట్రావెల్‌ స్మార్ట్, ఆక్సిజన్, పేవరల్డ్‌ వంటి 5 వేల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ సంస్థలతో ఒప్పందం చేసుకుంది కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ ఆర్కో భట్టాచార్య మాటల్లోనే...

ఈపే లేటర్‌ గురించి చెప్పే ముందు అసలు మన దేశంలో ఈ–కామర్స్‌ సంస్థల క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీఓడీ) విభాగం గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈపే లేటర్‌ ఆరంభమైంది గనక. దేశీ ఈ– కామర్స్‌ సంస్థల లావాదేవీల్లో 67% వాటా సీఓడీదే.కారణం మనం కొనే వస్తువుల్ని ప్రత్యక్షంగా చూస్తే తప్ప చెల్లింపులు చేయం. అలా అని ఆర్డరిచ్చిన ఉత్పత్తులు డెలివరీ కాగానే క్యాష్‌ ఇస్తే సరిపోదు. ఇక్కడ కూడా చెల్లింపుల ను కూడా మరింత సులువుగా, సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంతోనే 2015 డిసెంబర్‌లో ముంబై కేంద్రం గా.. స్నేహితులు అక్షయ్‌ సక్సే నా, ఉదయ్‌ సోమయాజులుతో కలిసి ఈపే లేటర్‌ను ప్రారం భించాం. ‘‘ముందైతే సేవలందుకోండి. తర్వాతే నగదును చెల్లించండి’’ ఇదే మా వ్యాపార సూత్రం.

డేటా సైన్స్, అనలిటిక్స్‌తో కస్టమర్ల ఎంపిక..
ఈపే లేటర్‌ సేవలను వినియోగించుకోవాలంటే ముందు ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్, ఆధార్, పాన్‌ కార్డు వివరాలు వెల్లడించాలి. అలా ఇచ్చిన కస్టమర్ల పాత లావాదేవీల చరిత్ర, సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తించే తీరు, ఇతరత్రా మార్గాల ద్వారా తనిఖీ చేస్తాం. డేటా సైన్స్, అనలిటిక్స్‌ ద్వారా వారి చరిత్రను విశ్లేషిస్తాం. ఎంపికైన కస్టమర్ల మొబైల్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. తర్వాతి నుంచి ఈపే లేటర్‌తో ఒప్పందం చేసుకున్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ సంస్థల సేవలను క్రెడిట్‌ రూపంలో వినియోగించుకునే వీలుంటుంది.

త్వరలో బస్సు, విమాన టికెట్లు కూడా..
ప్రస్తుతం 5 వేల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో 1.50 లక్షల సంస్థలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆయా సంస్థల సేవలను వినియోగించుకున్నాక 14 రోజులలోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే నెలకు 3 శాతం పెనాల్టీ ఉంటుంది. బీ2బీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.25 వేలు, బీ2సీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.2,500. క్రెడిట్‌పై గ్రాసరీ, షాపింగ్‌ వంటి సంస్థల సేవలే కాదు. రైల్వే టికెట్లనూ కొనొచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో బస్సు, విమాన టికెట్లనూ అందుబాటులోకి తెస్తాం.

ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం..
ప్రస్తుతం 30 మంది ఉద్యోగులు, 50 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 2,500–3,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 45%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 15%. ఈపే లేటర్‌ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ మీద మా ఒప్పంద సంస్థ నుంచి 2–2.5 శాతం వరకు కమీషన్‌ తీసుకుంటాం. ప్రతి నెలా 30 శాతం వ్యాపార వృద్ధిని సాధిస్తున్నాం. గతంలో సీడ్‌ రౌండ్‌లో భాగంగా దేశీయంగా ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి రూ.13.3 కోట్లు సమీకరించాం. ఏడాదిలో మరో విడత నిధులను
సమీకరిస్తాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top