ఆన్‌లైన్‌కు ‘ఎక్స్‌పీరియెన్స్‌’!

Companies efforts to impress customers online - Sakshi

ఫర్నిచర్‌ నుంచి  మొబైల్స్‌ దాకా ప్రత్యేక స్టోర్స్‌

ఆన్‌లైన్‌లో కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు కంపెనీల యత్నాలు

30% దాకా పెరుగుతున్న విక్రయాలు

పెప్పర్‌ ఫ్రై నుంచి షావొమీ దాకా అందరిదీ ఇదే తీరు... 

సాక్షి, బిజినెస్‌ విభాగం:ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నా... ఇప్పటికీ ఏదైనా ఉత్పత్తిని కొనుక్కోవాలంటే స్వయంగా చూసి, సంతృప్తి చెందాకే కొనేవారి సంఖ్యే ఎక్కువ. వీళ్లంతా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌కే ఓటేస్తుంటారు. ఆన్‌లైన్‌ సంస్థలు కూడా దీన్ని గుర్తించాయి. అందుకే... ఈ కస్టమర్స్‌కు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. 

ఏడాదిలో 11 స్టోర్స్‌.. 
ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌కు అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దుస్తులు, ఫర్నిషింగ్స్‌ రిటైల్‌ సంస్థ ఫ్యాబ్‌ ఇండియా ఏడాది వ్యవధిలోనే 11 సెంటర్స్‌ను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 30 సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. డిజిటల్‌ ప్రపంచానికే పరిమితమైన పెప్పర్‌ఫ్రై వంటి బ్రాండ్లు కూడా కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ను ఉపయోగిస్తున్నాయి. కొనుగోలుదారులు తాము కొనుక్కోవాలనుకునే ఫర్నిచర్‌ను తాకి, చూసి, అనుభూతి చెందాలనుకుంటున్నారని... అందుకే తామూ ఆఫ్‌లైన్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌ బాట పట్టామని సంస్థ వర్గాలు తెలిపాయి. కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫర్నిచర్‌ను ఎంచుకునేందుకు పెప్పర్‌ఫ్రై స్టూడియోస్‌ తోడ్పడుతున్నాయని, చూడటానికి వచ్చే వారిలో 50 శాతం మందికి పైగా కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో పెప్పర్‌ఫ్రై తమ ఆఫ్‌లైన్‌ వ్యూహాన్ని మరింత భారీగా విస్తరిస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ఆఖర్లో 29 స్టూడియోస్‌ ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 52కి చేరింది. 

అదే బాటలో చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు.. 
ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా అరంగేట్రం చేసిన వన్‌ ప్లస్‌ తొలిసారిగా బెంగళూరులో ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ ఏర్పాటు చేసింది. ఇప్పుడు చెన్నై, ఢిల్లీలో కూడా ప్రారంభించింది. భారతీయ కొనుగోలుదారులు ఏదైనా కొనడానికి ముందు నేరుగా చూడటానికే ప్రాధాన్యమిస్తారని.. అందుకే ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ జీఎం వికాస్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రీమియం కొనుగోలుదారులు తాము కొనుక్కునే ఉత్పత్తికి సంబంధించి అదనపు హంగులు కూడా కోరుకుంటారని.. అందుకే ప్రీమియం కాఫీ ఇవ్వడం వంటి సేవలు అందించడం ద్వారా ప్రత్యేక అనుభూతి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వన్‌ ప్లస్‌ పోటీ సంస్థ షావోమీ కూడా ఇదే తరహాలో చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో అయిదు ఎంఐ హోమ్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవలే రీలాంచ్‌ చేసిన జావా బైక్‌ బ్రాండ్‌ సంగతి తీసుకుంటే.. వీటి స్టోర్స్‌కి వచ్చే కొనుగోలుదారులు ఆయా బైక్‌ల పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవచ్చు. జావా సంబంధ టీ షర్టులు, యాక్సెసరీస్‌ను కొనుక్కోవచ్చు. లేదా లోపలే ఏర్పాటు చేసిన చిన్న పాటి లైబ్రరీలో పుస్తకాలు తిరగేయొచ్చు. 

అమ్మకాల్లోనూ వృద్ధి .. 
ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌తో అమ్మకాలూ గణనీయంగానే పెరుగుతున్నాయి. సాధారణంగా స్టోర్‌ను రీడెవలప్‌ చేస్తే అమ్మకాల వృద్ధి 6–7 శాతం మేర ఉంటుందని, కానీ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌తో 30 శాతం దాకా వృద్ధి ఉంటోందని ఫ్యాబ్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఆన్‌లైన్‌ ఆర్డరుతో పోలిస్తే తమ స్టూడియోకి వచ్చే వినియోగదారులిచ్చే ఆర్డరు విలువ సగటున మూడు రెట్లు ఎక్కువగా ఉంటోందని పెప్పర్‌ఫ్రై వర్గాలు తెలిపాయి. తమ ఆదాయాల్లో దాదాపు 30 శాతం వాటా స్టూడియోస్‌ నుంచే ఉంటోందని వివరించాయి. స్టూడియో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అమ్మకాలు 90–100 శాతం దాకా కూడా పెరుగుతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపాయి. ఆదాయాల్లో ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ వాటాను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 45 శాతానికి పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. సాధారణంగా ఇంటి అలంకరణ, లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్స్‌ చాలా ఏళ్లుగా ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తూనే ఉన్నాయి.  ఇలాంటి వాటి ద్వారా తాము అందించే విస్తృత శ్రేణిని ఒకే దగ్గర షోకేస్‌ చేసేందుకు వీలవుతుందని రోకా బాత్‌రూమ్‌ ప్రొడక్ట్స్‌ వర్గాలు తెలిపాయి. 50,000 చ.అ.లకు మించిన  విస్తీర్ణం ఉండేలా భారీ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్‌స్టయిల్‌ ఇంటర్నేషనల్‌ ఎండీ వసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు.  అయితే, కేవలం ఉత్పత్తులను డిస్‌ప్లే చేయడం, ధరల విషయాల గురించి తెలియజేయడం మాత్రమే ఈ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్స్‌ ఉద్దేశం కాదు. కొనుగోలుదారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో షాపింగ్‌ అనుభూతినివ్వడమే వీటి లక్ష్యమని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top