
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఏటీఎంల వద్ద నగదు లభ్యత క్రమంగా మెరుగవుతున్నదని ఎస్బీఐ పేర్కొంది. గత 24 గంటల్లో నగదు సరఫరా క్రమంగా పుంజుకుందని తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు కొరత కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పీఎన్బీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో ఎస్బీఐ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగైందని, నగదు కొరత నెలకొన్న ప్రాంతాల్లోనూ నగదు సరఫరా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే నగదు అందుబాటు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ సీఓఓ నీరజ్ వ్యాస్ చెప్పారు.
తమ ఏటీఎంల్లో నగదు లభ్యత పెంచేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగ్గా ఉందని, ఎలాంటి సమస్యలూ లేవని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు నగదు విత్డ్రా కోసం తమ ఏటీఎంలకు రావడంతోనే కొన్నిచోట్ల ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఇక కరెన్సీ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, తగినంత నగదు సరఫరా ఉందని ఆర్బీఐ స్పష్టం చేయగా రూ. 500 నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచామని కేంద్రం తెలిపింది.