రాజకీయ కుట్రపై సమరం | YS Vijayamma Start Samara Deeksha at Guntur | Sakshi
Sakshi News home page

రాజకీయ కుట్రపై సమరం

Aug 20 2013 1:34 AM | Updated on Aug 24 2018 2:33 PM

ఒక్క రోజుతో, ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల దుష్పరిపాలనను ప్రజలు మరిచిపోగలరా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.

* ప్రజలకు విజయమ్మ పిలుపు
* గుంటూరులో ఆమరణ దీక్ష ప్రారంభం
* విభజన.. కాంగ్రెస్ రాజకీయమే
* ఆ పార్టీపై పోరాటానికి సమయం ఆసన్నమైంది
* బాబు దన్నుతోనే విభజన నిర్ణయం
* ప్రజాగ్రహానికి కేంద్రం నుంచి కాంగ్రెస్ దిగొస్తుంది
* అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం చేసింది వైఎస్సే
* శాంతియుతంగానే ముందుకెళ్దామని పిలుపు
* జగనే ఆమరణ దీక్ష చేస్తానన్నారు.. కానీ ఆయన తరఫున తాను దీక్షకు  దిగానని వెల్లడి
 
సాక్షి, గుంటూరు: ఒక్క రోజుతో, ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల దుష్పరిపాలనను ప్రజలు మరిచిపోగలరా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ప్రాతిపదికంటూ ఏమీ లేకుండా కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం తమ హక్కు అని చెబుతున్న కాంగ్రెస్ పెద్దల తీరుపై న్యాయంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శాంతియుతంగానే ముందుకెళ్దామంటూ పిలుపునిచ్చారు. ప్రజాగ్రహాన్ని ఎవరూ తట్టుకోలేరని, కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి తప్పక దిగొస్తుందని చెప్పారు.

రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలనే డిమాండ్‌తో ఉద్యమాల పురిటిగడ్డ గుంటూరులో విజయమ్మ సోమవారం ‘సమరదీక్ష’కు శ్రీకారం చుట్టారు. దీక్షా ప్రాంగణంలో ముందుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత సమైక్య ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యమకారులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముప్పావు గంటపాటు ప్రసంగించిన విజయమ్మ, కేవలం అవకాశవాదంతో కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందంటూ తూర్పారబట్టారు. దీని ప్రభావం ఎనిమిదిన్నర కోట్ల ప్రజలపై దశాబ్దాలు, శతాబ్దాల పాటు ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ ఇచ్చేయండంటూ పదేపదే లేఖలు రాసిన చంద్రబాబు సాయంతోనే కాంగ్రెస్ సులువుగా విభజన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు విజయమ్మ మాటల్లోనే..

మాటకు కట్టుబడి ఉన్నాం
అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, రాష్ట్ర విభజన జరిగిపోయిందని పదేపదే చెబుతున్న దిగ్విజయ్‌సింగ్... తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉండగా అక్కడి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం తర్వాతే ఛత్తీస్‌గఢ్ ఏర్పడిందనే విషయం మరిచిపోయినట్టున్నారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న తొలి ఎస్సార్సీ సిఫార్సు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. నాగాలాండ్‌లో అతి తక్కువ జనాభా ఉన్నా భాషాప్రయుక్త ప్రాతిపదికనే రాష్ట్రం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండో ఎస్సార్సీకి మొగ్గు చూపారు. ఆయన నాయకత్వంలో 2004లో ఎన్నికలకు వెళ్లేముందు కేసీఆర్ కూడా రెండో ఎస్సార్సీకి సంతకం చేసిన విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయింది.

తెలంగాణ ఇవ్వాల్సి వస్తుందని వైఎస్‌తో సోనియాగాంధీ అంటే, అసలు తెలంగాణవాదం పెరగడానికి కారణాలేమిటో తెలుసుకోవాలని ఆయన అనుకున్నారు. తెలంగాణలోని ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకున్నారన్న ఆరోపణల్లో వాస్తవికత ఎంతో తెలుసుకోవాలని భావించారు. ‘తెలంగాణలో మైనారిటీల మనోభావాలేమిటి? హైదరాబాద్‌లో స్థిరపడిన వారి సంగతేమిటి? తెలంగాణ అంతటా ఉన్న సెటిలర్లలో భయాందోళనలకు పరిష్కారమెలా చూపాలి? తెలంగాణలో మావోయిజం ఎలా ఉంది? విభజిస్తే సమస్యలేమిటి? నీటి పంపకాలెలా ఉంటాయి? రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ సంగతేమిటి? హైదరాబాద్‌లో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను ఎక్కడకు పంపుతాం?’ వంటి పలు అంశాలకు జవాబులు దొరికనప్పుడే విభజన గురించి ఆలోచిస్తామని సోనియాకు వైఎస్ చెప్పారు. వైఎస్సార్ వారసత్వంగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అదే విధానాన్ని అనుసరిస్తుంది. పార్టీ ప్లీనరీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం.

హైదరాబాద్ పరిస్థితేమిటి?
‘‘60 ఏళ్లుగా హైదరాబాద్‌ను మనదనే భావనతోనే అభివృద్ధి చేసుకున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీఐఎల్, హెచ్‌ఎంటీ, బీడీఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీఐఎల్, మిథానీ, ఎన్‌ఎండీసీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, దానికి అనుబంధంగా నూరు సంస్థలు, ఎన్‌ఎఫ్‌సీ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడున్నాయి. రీసెర్చ్ ల్యాబ్‌లతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఫ్యాషన్ టెక్నాలజీ, నల్సార్, బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నాయి.

రాష్ట్ర ఆదాయంలో 45 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. రాయలసీమ, ఆంధ్రాల నుంచి ఎనభై, తొంభై శాతం మంది నగరంలో సంస్థలు ఏర్పాటు చేశారు. ఐటీలో రాష్ట్ర ఆదాయం రూ.55 వేల కోట్లయితే, అందులో రూ.54,800 కోట్లు ఒక్క హైదరాబాద్‌లోనే వస్తోంది. రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులను నగరంలో అభివృద్ధి చేశాం. నికర జలాలపై నీటి విడుదల ఉన్న జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ కూడా రాష్ట్రం విడిపోతే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారి కేంద్రం చేతుల్లోకి పోతాయి. చారిత్రక కట్టడాలుగా మిగిలిపోతాయి. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి నుంచి ఏ విధంగా నీరిస్తారో చెప్పలేదు.

సీమాంధ్రలో ఎలాంటి ఆదాయమూ వచ్చే పరిస్థితి లేదు. ఎన్జీవోలు పెన్ డౌన్ చేసినా తెలంగాణ ఇచ్చి తీరుతామంటున్నారు. ఉద్యోగులకు భద్రత ఇవ్వాల్సిన అవసరముంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం’’
 
తెలంగాణ వారిని అవమానించొద్దు
సీమాంధ్రకు తెలంగాణ నుంచి నాయకులు వచ్చినా, ప్రజలు వచ్చినా వెనక్కు పంపొద్దు. అవమానించొద్దు. అన్నదమ్ముల్లా సంస్కారవంతంగా ప్రవర్తించాలి. పరస్పరం బాధపడుతూ, దూషించుకుంటున్న రాష్ట్రాన్ని చూసి బాధేస్తోంది. వైఎస్ కోరుకున్న రాష్ట్రం ఇది కాదు.

సమన్యాయం చేసింది వైఎస్సే
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేసింది వైఎస్ ఒక్కరే. మూడు ప్రాంతాలనూ ఆయన సమానంగా ప్రేమించారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఏ వర్గం, గ్రామం, ఏప్రాంతం వారైనా అందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేశారు. సమానంగా సాయం చేశారు. రైతులు కరువుతో అల్లాడే సీమాంధ్ర జిల్లాల కోసం పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను ప్రారంభించారు. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి కరువు జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య నివారణకు కృషి చేశారు. రాయలసీమలో వెలిగొండ, వెలిగల్లు, తెలుగుగంగ, హంద్రీ నీవా; తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి. బీమా, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు చేపట్టారు. ఏడు జిల్లాల్లో 16.5 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రాణహిత-చేవెళ్ల మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు తోటపల్లి, వంశధార-3 ఫేజ్, జంఝావతి మొదలు పెట్టారు.

తెలంగాణకు అడ్డుపడేవాళ్లం కాదు
తెలంగాణకు న్యాయం జరుగుతుందంటే, అక్కడి ప్రజలు మెరుగ్గా బతుకుతామంటే  అడ్డుపడే వ్యక్తులం కాదు. అయితే భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం మంచిది కాదు. భావోద్వేగం చల్లారిన తర్వాత వాస్తవికత ప్రజలకు అనుభవం అవుతుంది. ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా మళ్లీ జీవన సమరం మొదలవుతుంది. సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. నీరు, ఆహారం, చదువు, విద్యుత్తు, ఉద్యోగం, రోడ్లు, ఉపాధి, ఆహారం, ఆవాసం, శాంతిభద్రతల వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాంగ్రెస్ నిర్ణయం ఏ ప్రాంతానికి ఏ మేరకు మేలుగా పరిణమిస్తుందో తెలియని పరిస్థితి! వాళ్లు రాజనీతిజ్ఞుల్లా న్యాయం చేయలేదు. సీట్లు, ఓట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు దన్నుతోనే రాష్ట్ర విభజన...
తెలంగాణ ఇచ్చేయండంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో లేఖలు రాసిచ్చారు. ఒక ఓటు, రెండు రాష్ట్రాలు సిద్ధాంతమున్న బీజేపీతో 1998లో కలిసి పోటీ చేశారు. తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి మరీ 2009లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఇవ్వాలని 2008లో ప్రణబ్ కమిటీకి రాసిచ్చారు. ఇక 2013లో తెలంగాణపై కన్‌ఫర్మ్ చేసేశారు. నీటి సమస్య, హైదరాబాద్, ఉద్యోగాలు గురించి ఏమీ రాయకుండా రాజకీయం కోసం ఇలా చేశారు. బాబు సహకారంతో విభజన ను కాంగ్రెస్ సులభంగా ప్రకటించగలిగింది. విభజన ప్రక్రియ జరగబోతుందని తెలిపి, గత జూలై 25నే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బాబు చోద్యం చూడకుండా తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా రాజీనామా చేస్తే ఇంతదూరం రాదు. ఇప్పుడేమో రాజధాని నిర్మాణంపై కాకి లెక్కలు చెబుతున్నారు. ఎన్ని లక్షల కోట్లిచ్చినా హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడం అసాధ్యం. కేంద్రం వైఖరి ఉమ్మడి కుటుంబంలో తండ్రి తన కుమారుల్లో ఒకరికి ఇల్లు, ఆస్తుల వంటివన్నీ ఇచ్చి, మరొకరిని కట్టుబట్టలతో వెళ్లిపోయి ఇల్లు కట్టుకొమ్మనట్లు ఉంది.

సమరదీక్ష సభకు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మేకపాటి, నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్లు బాలాజీ, ఉదయభాను, బాలరాజు, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, భూమన, సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల నాని, తానేటి వనిత, కొడాలి నాని, జోగి రమేశ్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, పార్టీ నేతలు వంగవీటి రాధ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, జ్యోతుల నెహ్రూ, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పి.గౌతంరెడ్డి, కణితి విశ్వనాథం, జ్యేష్ట రమేశ్‌బాబు, మేకా ప్రతాప్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
జగన్‌ను చూస్తే గర్వంగా ఉంది
ఏ ప్రాంతం వారైనా వైఎస్‌కు బిడ్డలతో సమానమే. అందుకే ఆయన రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నారు. పార్టీలో ఉండి అడ్డుకున్నారు. వైఎస్ వారసుడిగా జగన్ ఆ బాధ్యతను భుజాలపై ఎత్తుకున్నాడు. రాజకీయాలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని జైల్లో నిరాహార దీక్ష చేయాలనుకున్నాడు. నేను వెళ్లినప్పుడు నాకు అదే విషయం చెప్పాడు. ‘ఇప్పటికే వారానికి రెండు ములాఖత్‌లు ఇస్తున్నారు. కేవలం ఆరుగురినే కలవగలుతున్నావు.

నిరాహార దీక్ష చేస్తే ములాఖత్‌లు రద్దు చేసి, ఈ జైలు నుంచి వేరే రాష్ట్రానికి ఎక్కడికైనా పంపుతారేమో. నీ తరఫున నేను నిరాహార దీక్ష చేస్తా’నని చెప్పి వచ్చా. జైల్లో ఉండి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న జగన్‌ను చూసి గర్వంగా ఉంది. జైల్లో ఉన్న ఈ 15 నెలల్లో జగన్ తనకు నిద్ర పట్టడం లేదని నాకెప్పుడూ చెప్పలేదు. విభజన ప్రక్రియ గురించి విన్నప్పట్నుంచీ మాత్రం మనసుకు ఎంతో కష్టంగా ఉందని చెబుతున్నాడు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటున్నాడు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నాడు. రెండు ప్రాంతాలూ కలిసుండే రోజు వస్తుందని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’’
 
బీఎస్‌ఎఫ్ దళాల భయోత్పాతం
సమరదీక్షకు సంఘీభావం తెలిపేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్న మహిళలు, వృద్ధులు దీక్షా శిబిరం చేరుకోవడానికి నానాప్రయాస పడాల్సి వచ్చింది. భద్రత పేరుతో శిబిరానికి నలువైపులా దారుల్లో బీఎస్‌ఎఫ్ దళాలు మోహరించాయి. సాయుధ సిబ్బంది కవాతు చేస్తూ శిబిరానికి వచ్చే వారికి లాఠీలు చూపిస్తూ అడ్డుగా నిలిచారు.

దీనిపై పలువురు ఆగ్రహించారు. ఇది ప్రభుత్వ కుట్రేనంటూ మండిపడ్డారు. విజయమ్మకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వారిని ఖాకీల దన్నుతో తొలి రోజు నుంచే కట్టడి చేస్తున్నారంటూ ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement