వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే అధికారమని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ అన్నారు.
సాక్షి, నెల్లూరు : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే అధికారమని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మురళీధర్ ‘సాక్షి’తో సోమవారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం వీస్తోందన్నారు. మహానేత వైఎస్సార్ చేసిన సేవలు రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలకు విపరీతమైన ప్రేమాభిమానాలున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే రాష్ట్ర విభజన తెరపైకి వచ్చిందన్నారు.
జగన్ను చూసి బెదిరే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు సిద్ధమైందన్నారు. దీనికి టీడీపీ వంత పాడిందని మేరిగ విమర్శించారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేవన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. వైఎస్సార్ సువర్ణ పాలన మళ్లీ వస్తుందన్నారు. జిల్లాలో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని మేరిగ చెప్పారు. తాను అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు , నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మేరిగ చెప్పారు.