యాభై ఏళ్లల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క అడ్వకేట్ జనరల్ను కూడా నియమించలేదన్న ఈటెల వ్యాఖ్యపై ముఖ్యమంత్రి కిరణ్ స్పందించారు.
సాక్షి, హైదరాబాద్ : యాభై ఏళ్లల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క అడ్వకేట్ జనరల్ను కూడా నియమించలేదన్న ఈటెల వ్యాఖ్యపై ముఖ్యమంత్రి కిరణ్ స్పందించారు. ఈ యాభై ఏళ్లల్లో తెలంగాణకు చెందిన వారు నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారి హయాంలో తెలంగాణ వ్యక్తికి ఎందుకు ఏజీ పోస్టును ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ‘తెలంగాణ వారిని సరిగ్గా పరిపాలించే అవకాశం మీరు కల్పించారా?’ అని బదులిచ్చారు. కాగా ప్రస్తుత ఏజీ సుదర్శన్రెడ్డి ముఖ్యమంత్రికి క్లాస్మేట్ కావడం వల్లనే అవకాశం వచ్చిందన్న ఈటెల వ్యాఖ్యపై కూడా సీఎం స్పందిస్తూ ‘ఆయన నా క్లాస్మేట్ కాదు...నా కంటే సీనియర్ అని’ చెప్పారు.
పీవీని మేమే గెలిపించాం: చంద్రబాబు
తెలంగాణ వారిని రాజకీయ పదవులు అనుభవించకుండా సీమాంధ్ర వారు కుట్రలు చేశారని ఈటెల చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్పందించారు. ‘పీవీ నరసింహారావు ప్రధాని అయిన తర్వాత మీ (తెలంగాణ) ప్రాంతం నుంచి కాకుండా మా ప్రాంతం నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించాము’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పీవీకి మద్దతుగా టీడీపీ పోటీ చేయలేదని బాబు చెప్పారు.