గ్రామాల్లో దాహం.. దాహం | Water Problem In Villages | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో దాహం.. దాహం

Mar 4 2019 5:37 PM | Updated on Mar 4 2019 5:37 PM

Water Problem In Villages - Sakshi

కోటూరులో మంచినీటి కోసం కోళాయి వద్ద ఉంచిన బిందెలు

సాక్షి,గాండ్లపెంట: వేసవి కాలం రాకముందే పలు గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యతో స్థానికుల సతమతమవుతున్నారు. చుక్క నీటి కోసం రాత్రిళ్లు జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాండ్లపెంట మండల పరిధిలోని మలమీదపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన దేవలచెరువుపల్లి, కరణంవారిపల్లి, కోటూరు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కోటూరు గ్రామంలో టీడీపీకి చెందిన ఓ జెడ్పీటీసీ ఉన్నా పట్టించుకోవడం లేదు. కోటూరులో గత నాలుగు నెలలుగా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోలేదని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మలమీదపల్లి గ్రామ పంచాయతీ బోరులో అదనపు పైపులు అమర్చినా నీరు ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు చేరకపోవడంతో ఎగువ ప్రాంతాల్లోని వారు రాత్రి సమయంలో ఎక్కడ బోర్లు ఉంటే అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. పంచాయతీ బోరు నీటిని నేరుగా ఓహెచ్‌ఆర్‌ ట్యాంకుకు నింపితే అందరికి నీరు అందే వీలుందని మలమీదపల్లి ఎంపీటీసీ వైస్‌ ఎంపీపీ ఆదెప్పనాయుడు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కుటుంబాలు అధికంగా ఉన్నాయని, పంచాయతీ నీటిని నేరుగా ట్యాంకుకు పంపితే కొద్దో గొప్పో ఎగువ ప్రాంతాలకు నీరు అందే వీలుంది. అదే విధంగా దేవలచెరువుపల్లిలో నాలుగు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడినా ఎవరూ స్పందించలేదు. కోటూరులో పంచాయతీ పథకంలో నీరు అడుగంటి పోవడంతో వచ్చే కొద్దిపాటి నీటి కోసం రాత్రిళ్లు బిందెలు కోళాయిల వద్ద ఉంచాల్సిన దుస్థితి నెలకొంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement