పోటెత్తిన యువత
ముగిసిన ఓటు నమోదు ప్రక్రియ
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): ఎన్నికల వేళ జిల్లాలో ఓటు నమోదుకు భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో 1,59,961 మంది దరఖాస్తు చేసుకుంటే, బూత్స్థాయి అధికారుల వద్ద 54,736 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఆ రోజు నుండి రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, బదిలీకి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. వీటికి ఏకంగా 2,14,697 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రత్యేక శిబిరాలతో ఫలితాలు
అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి కళాశాలలో నమోదు చేసేందుకు అధికారులు కదిలారు. అదే విధంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద శనివారం, ఆదివారం బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించారు. దీంతో ఓటర్లుగా నమోదు అయ్యేందుకు యువత ఉత్సాహం చూపించారు.
ఇప్పటికీ అవకాశం : ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగిసింది. అయితే ప్రస్తుతం కూడాఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో, స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఎన్విఎస్పి.ఎన్ఐసి.ఇన్ వెబ్ పోర్టల్లో 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దారు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ (అక్టోబరు 31 వరకూ) నమోదు చేసుకున్న వారికి మాత్రం 2019, జనవరిలో ఓటు హక్కు కల్పిస్తారు. నవంబరు ఒకటో తేదీ నుండి వచ్చే దరఖాస్తులకు జనవరి 4వ తేదీలోగా ఓటు రాదు. వాస్తవంగా సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదలైన తరువాత నామినేషన్ ఆఖరు తేదీ వరకూ ఓటు నమోదు చేసుకోవచ్చు. వీరికి కూడా ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంది.
జనవరి 4న తుది జాబితా ప్రచురణ: వచ్చిన దరఖాస్తులపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టి జనవరి 4వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఏటా అక్టోబరు నుంచి జనవరి వరకూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో ఏటా లక్ష లోపు దరఖాస్తులు వచ్చేవి. ఎన్నికలు దగ్గరపడటంతో ఈసారి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
సెప్టెంబరు కొత్తగా