సదావర్తి సత్రం భూములు మాకే దక్కాలి | Verbal orders of government to Endowment department Authorities | Sakshi
Sakshi News home page

సదావర్తి సత్రం భూములు మాకే దక్కాలి

Apr 6 2017 12:53 AM | Updated on Oct 1 2018 4:15 PM

గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న రూ.1,000 కోట్ల విలువైన భూములను

అధికారులకు ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలు

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న రూ.1,000 కోట్ల విలువైన భూములను ఎలాగైనా కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది కాలంగా మరుగున పడి ఉన్న ఈ వ్యవహారాన్ని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. సత్రం భూములు తమకు దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి దేవాదాయ శాఖ అధికారులకు తాజాగా మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూములపై బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశం జరిగింది. కమిషనర్‌ అనూరాధ, సత్రం ఫౌండర్‌ ట్రస్టీ సభ్యుడు వాసిరెడ్డి సుధాస్వరూప్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సత్రం భూముల అమ్మకంపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు త్వరగా పరిష్కారమై, తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై చర్చించారు.

ఏడాది కిత్రం జరిగిన వేలం కథ
సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో 83.11 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి విక్రయానికి గతేడాది మార్చి 28వ తేదీన దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. టీడీపీ పెద్దలకు కేవలం రూ.22.44 కోట్లకు వేలంలో కట్టబెట్టేందుకు పావులు కదిపారు. నిబంధనలన్నీ పక్కన పెట్టి వేలం ప్రక్రియను పూర్తి చేశారు. ఈ–వేలం విధానం జోలికే వెళ్లలేదు.  అతి తక్కువ ధరకు వేలంలో భూమిని దక్కించుకున్న 8 మంది సభ్యుల బృందంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ భార్య, మరో ఇద్దరు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement