వేగంగా వెలిగొండ పునరావాస కాలనీ పనులు

Veligonda Project Rehabilitation Center In Prakasam - Sakshi

సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

పదేళ్లుగా ముంపు గ్రామాలపై గత ప్రభుత్వాల వివక్ష

సాక్షి, మార్కాపురం (ప్రకాశం): వెలిగొండ ప్రాజెక్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నష్టపరిహారం తప్ప... గత పదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పునరావాస పనులు... ప్యాకేజి ... పరిహారం... వెలిగొండ ముంపు గ్రామాల రైతులకు అందలేదు. ముఖ్యమంత్రిగా నెల రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి మొదటి దశ నీరు అందించటంతో పాటు, పునరావాస కాలనీ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించటంతో 10 రోజుల నుంచి పనుల్లో కదలిక వచ్చింది.

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించటంతో పాటు పునరావాస కాలనీల నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు, రైతుల్లో పునరావాస కాలనీలపై ఆశలు చిగురించాయి. వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గోగులదిన్నె, తోకపల్లె, ఇడుపూరు, వేములకోట, ఒందుట్ల వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనులపై జాయింట్‌ కలెక్టర్‌ షన్‌మోహన్, స్పెషల్‌ కలెక్టర్‌ చంద్రమౌళితో ప్రాజెక్టు ఎస్‌ఈ వీర్రాజు కలిసి శనివారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, సిమెంట్‌ కాలువలు, విద్యుత్‌ సౌకర్యం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, దేవాలయాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

గతంలో ఇలా.. 
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు ప్రభుత్వం పునరావాస కాలనీలు ప్రారంభించక, అటు ఉన్న గ్రామాల్లో శిథిలమైన గృహాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య పర్యావరణానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం, రైతుల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడ వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇంతకాలం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహించింది. 

పదేళ్లుగా నష్టపరిహారం కోసం వెలిగొండ ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా, సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతండా, కాకర్ల, మాగుటూరు తండా, సాయినగర్, కృష్ణనగర్, తదితర గ్రామాల ప్రజలు ఎదురు చూశారు. ప్రభుత్వం పరిహారం చెల్లింపు, ఆర్‌ఆర్‌ ప్యాకేజి అమలులో చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేసింది. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్‌లను నిర్మించారు. ఈ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహించారు. సుమారు పదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు.

గొట్టిపడియ గ్రామ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 18 ఏళ్లు నిండిన వారి కుటుంబాలు సుమారు 1800 వరకు ఉన్నాయి. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 80 కుటుంబాలు,  సుంకేసులలో 2,760 కుటుంబాలు, కలనూతలలో 1,040 కుటుంబాలు, గుండంచర్లలో 1,150 కుటుంబాలు, కాటంరాజుతండాలో 40 కుటుంబాలు ఉన్నాయి. గొట్టిపడియ డ్యామ్‌ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్‌ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల్లోని కొంత మందికి మార్కాపురం మండలం వేములకోట వద్ద, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సుంకేసుల గ్రామస్తులకు మార్కాపురం మండలం గోగులదిన్నె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద, గుండంచర్ల గ్రామస్తులకు దరిమడుగు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. స్థల సేకరణ మాత్రమే ఇప్పటికీ జరిగింది. ఇప్పటి వరకు గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదు.  దీంతో వర్షాకాలంలో ముంపు గ్రామాల ప్రజలు కొద్దిగా నీరు వచ్చినా క్షణ క్షణం భయంగా కాలం గడపాల్సి వస్తోంది. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి తొమ్మిదేళ్లు కావొస్తుంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్‌ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్‌ఆర్‌ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు.

మంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రత్యేక దృష్టి: 
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజి అమలుపై దృష్టి సారించారు.

చాలా ఆనందంగా ఉంది
జగనన్న సీఎం కాగానే వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు పునరావాస పనులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవటంతో నత్తనడకన సాగాయి. 10 రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉండటంతో పాటు పునరావాస పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 
– పుప్పాల మార్తమ్మ, ఎంపీటీసీ, గొట్టిపడియ 

జగనన్న సీఎం కాగానే మాకు నమ్మకం పెరిగింది
పదేళ్లుగా మేమందరం నిర్లక్ష్యానికి గురయ్యాం. ముఖ్యమంత్రిగా జగనన్న ఎన్నిక కావటంతో వెలిగొండ ప్రాజెక్టుపై మాలో ఆశలు చిగురించాయి. కలెక్టర్‌ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టుపై రివ్యూ చేయటం సంతోషాన్నిచ్చింది. పునరావాస కాలనీలు త్వరగా పూర్తి చేయాలి. మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నీరు ఇవ్వాలి. 
– తుమ్మా వెంకటరెడ్డి, వైఎస్‌ఆర్‌ సీపీ నేత, గొట్టిపడియ గ్రామం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top