మరో ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్
కడప రూరల్: తిరుపతిలోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం మన జిల్లాకు చెందిన ఇద్దరు కరోనా బాధితుల్ని డిశ్చార్జ్ చేసినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మహిళ (75), ఆమె కుమారుడు (50)ని అధికారులు స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం అనంతరం వారికి కరోనా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకూ 65 మంది డిశ్చార్జ్ అ య్యారు. కాగా కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బద్వేలు మండల పరిధిలోని గొడు గునూరులో ఒకటి, ప్రధమంగా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె మండలం మోటకట్లలో మరొకటి నమోదైంది. ఇవన్నీ కోయంబేడు మార్కెట్కు సంబంధించిన కేసులు. దీంతో కేసుల సంఖ్య 102కు చేరింది.
వేంపల్లె ఇక గ్రీన్ జోన్
కడప సిటీ : వేంపల్లె పంచాయతీ పరిధి ఇకనుంచి గ్రీన్జోన్గా మారింది. కరోనా కేసుల నమోదు వల్ల కంటైన్మెంట్ జోన్గా ఇక్కడ ఆంక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే. వేంపల్లెలో చివరగా ఏప్రిల్ 1వ తేదిన పాజిటివ్ కేసు నమోదైంది. చివరి కేసు కూడా గతనెల 16వ తేదిన నెగెటివ్ రిపోర్టు రావడంతో డిశ్చార్జి చేయడం జరిగింది. అప్పటి నుంచి 28 రోజులకాలంలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.