
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆదివారం శుభవార్త చెప్పింది. ఆన్లైన్ దర్శనం టికెట్ల కోటాను పెంచుతున్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతిరోజు ఇస్తున్న 6 వేల టికెట్లను జులై 1 నుంచి 9 వేల వరకు పెంచనున్నట్టు తెలిపింది. రేపు (సోమవారం) ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తామని చెప్పింది. రోజుకు 9వేల చొప్పున స్లాట్ల వారిగా అందుబాటులో ఉంచనున్నామని బోర్డు ప్రకటించింది. జులై 1 నుంచి రోజుకు 3 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నామని తెలిపింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లోని కౌంటర్ల ద్వారా.. ఒకరోజు ముందుగా భక్తులు టికెట్లు పొందొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం, జులై 30 నుంచి ఆగస్టు వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: యూట్యూబ్ చానల్స్ ప్రతినిధుల బరితెగింపు)