ఇష్టపడి..కష్టపడి

Trainy IPS Officer Dheeraj Kumar Special Interview - Sakshi

నందలూరు నుంచి సివిల్‌ సర్వీసుకు ఎంపికైన మరో యువకిశోరం

వైద్యవిద్యనభ్యసించినా ప్రజాసేవలో ముందుకెళ్లాలనే తలంపు

సాక్షితో ట్రైనీఐపీఎస్‌ ధీరజ్‌కుమార్‌

తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. సాధారణంగా వీరికుమారుడు కూడా డాక్టరవుతాడు. ఇది సాధారణం.ఎంబీబీఎస్‌ చదివినా అతని మనసు మాత్రం సివిల్‌ సర్వీసు వైపే ఉంది. అదే ధ్యేయంగా పెట్టుకుని పట్టుదలతో సాధించాడు నందలూరుకు చెందిన డాక్టర్‌ బి. ధీరజ్‌కుమార్‌.. ఈయన గతేడాది ప్రిలిమినరీ పరీక్షల్లో పాసై తర్వాత మెయిన్స్‌లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిఇంటర్వ్యూ అనంతరం సివిల్‌సర్వీసుకు ఎంపికయ్యాడు. 559వ ర్యాంకు సాధించాడు. ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. సివిల్‌ సర్వీసులకు అధికంగా ఎంపికవుతున్న నందలూరు నుంచే ఈయన కూడా సెలెక్ట్‌ కావడం విశేషం. మాంటిసోరిలో శిక్షణ పొందుతూ స్వస్థలం వచ్చిన ఈయన్ను సాక్షి పలకరించింది.

పేరు : బి ధీరజ్‌కుమార్‌
తల్లిదండ్రులు: విజయభాస్కర్‌..విజయభారతి
వీరి వృత్తి: తండ్రి రైల్వేలో మెడికల్‌ ఆఫీసర్‌..తల్లి ప్రభుత్వ వైద్యురాలు
విద్యాభ్యాసం: ఎంబీబీఎస్‌(ఎస్వీ మెడికల్‌ కళాశాల
సివిల్‌సర్వీస్‌ బ్యాచ్‌: 2018

సాక్షి: డాక్టర్ల ఇంట పుట్టారు..సివిల్స్‌ æవైపు ఎందుకు మొగ్గు చూపారు
ధీరజ్‌: ఔను..అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్లే. మొదట్లో నేను కూడా డాక్టర్‌ కావాలనుకున్నాను. అందుకే ఎంబీబీఎస్‌ చదివాను. కానీ తర్వాత సివిల్‌ సర్వీసుకు ఎంపికై ప్రజాసేవ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని భావించాను .అందుకే ఆదిశగా ప్రయత్నించాను.

సాక్షి: మీకు సివిల్స్‌ ప్రేరణ ఎలా కలిగింది
ధీరజ్‌: నేను పుట్టి పెరిగిన నందలూరు నాకు ప్రేరణ. ఈ ఊరి నుంచి ఐదుగురు ఐఎఎస్‌కు ఎంపికయ్యారని తెలుసుకున్నాను. ఒకరకంగా ఇదే నా ఆలోచన మార్చిందేమో. నేను కూడా వారి లాగే ఐఎఎస్‌కు ఎంపిక కావాలనుకున్నాను. మొత్తంమీద ఐపీఎస్‌ వచ్చింది. కానీ పట్టుదల వదల్లేదు. ఐఎఎస్‌ కావాలని మళ్లీ పరీక్షలు రాస్తున్నాను.

సాక్షి: ఎంబీబీఎస్‌ తర్వాత వైద్య వృత్తి చేపట్టినట్లు లేదు..
ధీరజ్‌: నిజమే. ఎంబీబీఎస్‌ పూర్తి అయిన పోటీల పరీక్షలకు హాజరయ్యాను. ఐఆర్‌పీఎస్‌ సాధించాను., హైదరాబాదు డివిజన్‌లో పర్సనల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది.  దీంతో పట్టుదల రెట్టించి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివాను. ఫలితంగా గతేడాది సివిల్స్‌ సర్వీసు పరీక్షలలో 559 ర్యాంకు పొందాను. ఆ ఫలితమే ఐపీఎస్‌.

సాక్షి: తొలి పోస్టింగ్‌ ఎక్కడ వస్తుందనుకుంటున్నారు.
ధీరజ్‌: మహారాష్ట్ర క్యాడర్‌ వచ్చింది. అందువల్ల ఆ రాష్ట్రంలో పోస్టింగ్‌ వస్తుందని ఆశిస్తున్నాను.

సాక్షి: నేటి యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు
ధీరజ్‌: యువత విద్యకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏ పనైనా ఇష్టపడి చేస్తే బాగుంటుంది. చదువు కూడా అంతే. నచ్చిన కోర్సు కోసం క్రమశిక్షణతో ప్రిపేరవ్వాలి. దీనివల్ల  ఏ పోటీ పరీక్షలలో అయినా విజేతగా నిలవగలం. ఓటమితో కుంగిపోకూడాదు. పట్టుదల వదలకూడదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top