మెగా సిటీగా తిరుపతి | Tirupathi as mega city | Sakshi
Sakshi News home page

మెగా సిటీగా తిరుపతి

May 4 2015 3:54 AM | Updated on Sep 3 2017 1:21 AM

తిరుపతిని మెగాసిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు...

- మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
తిరుపతి గాంధీరోడ్డు: తిరుపతిని మెగాసిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఆదివారం డివిడెండ్ పంపిణీ కార్యక్రమం పులుగోరు మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోవు తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా టీడీపీని గెలిపించే విధంగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్ ఇంటర్నేషనల్ రైల్వేస్టేషన్ అవ్వాలంటే పక్కనే ఉన్న టీటీడీ స్థలాన్ని కేటాయించాలన్నారు.

నూతన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకరించాలన్నారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి బాటలో నడుస్తోందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి బ్యాంక్‌కు రుణాలు వచ్చేలా సహకరిస్తామన్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ మాట్లాడుతూ రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న టీటీడీ స్థలాన్ని రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేటాయిస్తామన్నారు. అవసరమయితే సత్రాలను కూడా రైల్వేస్టేషన్ అభివృద్ధికి ఇస్తామని తెలిపారు. నగరం అభివృద్ధి చెందుతుందంటే ఏ ఫైల్ మీద అయినా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ 53 వేల మందికి 1 కోటి 20 లక్షల రూపాయల డివిడెండ్ ఫండ్ మంజూరైయిందన్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ కో-ఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడేవారని కంట తడిపెడుతూ అలాంటి మనిషి మన మధ్య లేరని పేర్కొన్నారు. అనంతరం డివిడెండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, టౌన్‌బ్యాంక్ డెరైక్టర్లు, మెంబర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement