‘పశ్చిమ’లో ఘోర రోడ్డు ప్రమాదం | Three dead in the road accident | Sakshi
Sakshi News home page

‘పశ్చిమ’లో ఘోర రోడ్డు ప్రమాదం

Dec 25 2017 1:37 AM | Updated on Sep 15 2018 7:55 PM

Three dead in the road accident - Sakshi

భీమడోలు: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనం అదుపుతప్పి, రెండు బైక్‌లను ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడివాడకు చెందిన జంగం ఆనంద్‌రాజ్‌ పశ్చిమ బెంగాల్‌లో ని దుర్గాపూర్‌లో ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం కుటుంబంతో కలసి స్కార్పియో వాహనంలో దుర్గాపూర్‌ నుంచి గుడివాడకు బయలుదేరారు. అయితే డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల స్కార్పియో వాహనం అదుపుతప్పి కురెళ్లగూడెం వద్ద రెండు మోటార్‌ సైకిళ్లతో పాటు కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను ఢీకొంది. అనంతరం పల్టీలు కొట్టుకుంటూ డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న దాసరి కృష్ణయ్య, అతడి మనవడు తాళ్లూరి అరుణ్‌(8) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో వెళ్తున్న మహిళా కూలి చలమల సత్యవతి తీవ్రంగా గాయపడి.. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.  ప్రమాదంలో కారు, ఆటో, బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి.

పుట్టిన రోజు నాడే..
కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దాసరి కృష్ణ తన మనవడు తాళ్లూరి అరుణ్‌ పుట్టిన రోజు కావడంతో కొండాలమ్మ ఆలయం వద్ద పూజలు చేయించేందుకు అరుణ్‌తో కలసి బైక్‌పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Advertisement
 
Advertisement
Advertisement