మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటిక లేకపోవడంతో.. ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నించగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రకాశం : మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటిక లేకపోవడంతో.. ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నించగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొండెపి మండలం అనకర్లపుడి గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనకర్లపుడి గ్రామానికి చెందిన పి.శ్రీను(40) వెలుగులో ఔట్సోర్సింగ్ కార్మికునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు.
దీంతో సంప్రదాయబద్ధంగా ఖననం చేయడానికి అతని కుటుంబ సభ్యులు గురువారం ఏర్పాట్లు చేశారు. కానీ గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో ఎక్కడ పూడ్చాలో తెలియక ఇంటి సమీపంలోనే పూడ్చడానికి ప్రయత్నాలు చేయడంతో.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.