పార్టీ బలోపేతంపైనే దృష్టి | Telangana people kept ysr in hearts | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతంపైనే దృష్టి

Aug 9 2013 2:48 AM | Updated on May 25 2018 9:10 PM

‘తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకుని ఉన్నారు. ఆయనను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తాం.

సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకుని ఉన్నారు. ఆయనను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తాం. తెలంగాణలో పార్టీ పని అయిపోందని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిని కార్యకర్తలు నమ్మొద్దు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ‘ప్లీనరీ’ తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంది.
 
 రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్’... అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం పేర్కొంటోంది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వానికి జిల్లా నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ మనుగడకు వచ్చిన ముప్పేమీ లేదని, జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు తమ నియోజకవర్గాల్లో శ్రమిస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చారు.
 
 రెండు రాష్ట్రాలు ఏర్పడితే జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందని పార్టీ వర్గా లు చెప్పాయి. ‘పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడుస్తాం. పార్టీనీ పటిష్టం చేస్తాం. జిల్లా ప్రజలు ఎదుర్కొనే  ప్రతి సమస్యపైనా పోరాటాలు చేస్తాం. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెడతాం. వైఎస్‌ఆర్ అభిమానులు ఎందరో ఉన్నారు. కష్టపడతాం. పార్టీ అభ్యర్థులం గెలి పించుకుంటాం..’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా క న్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
 
 సమావేశంలో సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పాదూరి కరుణ, సీనియర్ నాయకుడు గాదె నిరంజన్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ కో ఆర్డినేటర్ సురేష్ నాయక్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు బోయపల్లి అనంత్‌కుమార్‌గౌడ్, నకిరేకల్ నియోజకవర్గ నాయకుడు నకిరేకంటి స్వామి పాల్గొన్నారు. అదే మాదిరిగా పార్టీ ఇతర నాయకులు అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, చామల భాస్కర్‌రెడ్డి, గట్టు మధుసూదన్‌రావు, చామల భాస్కర్‌రెడ్డి, ఇరుగు వెంకటేశ్వర్లు, వడ్లోజు వెంకటేశ్వర్లు, ఇరుగు సునీల్, గూడూరు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement