అప్పులబాధ తాళలేక పురోహితుడి ఆత్మహత్య | teacher, dead, zp high school | Sakshi
Sakshi News home page

అప్పులబాధ తాళలేక పురోహితుడి ఆత్మహత్య

Mar 5 2015 1:49 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడు మృతి చెందగా భార్య, పెద్ద కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

కాకినాడ క్రైం : అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడు మృతి చెందగా భార్య, పెద్ద కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్న కుమారుడు విషయం తెలిసి పురుగుమందు తాగకపోవడంతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలోని అగ్రహారానికి చెందిన ఏడిద శ్రీనివాస శర్మ (45) పురోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని అత్తగారికి సంబంధించిన ఆస్తిని గతంలో అతడు విక్రయించాడు. దానికి సంబంధించి అత్తింటివారు కోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆ ఆస్తికి చెందిన సొమ్మును శ్రీనివాస శర్మ కోర్టుకు చెల్లించాల్సి ఉంది.

గడువు సమీపిస్తుండడంతో మనస్తాపానికి గురైన అతడు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు డబ్బా, థమ్స్‌అప్ డ్రింకు బాటిల్ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్లాడు. అప్పులు తీర్చే మార్గ లేదని, అందరం కలిసి పురుగుమందు తాగి చనిపోదామని భార్య 39 ఏళ్ల సుబ్బలక్ష్మి, 18 ఏళ్ల పెద్ద కుమారుడు అఖిల్, 16 ఏళ్ల చిన్న కుమారుడు అనిల్‌లకు సూచించాడు. తొలుత శ్రీనివాస శర్మ పురుగుమందు కలిపిన డ్రింకు తాగాడు. అతని భార్య, పెద్ద కుమారుడు అతడు చెప్పిన విధంగానే తాగారు. అయితే చిన్న కుమారుడు అనిల్ అందుకు వ్యతిరేకించి అన్నయ్య అఖిల్ వద్ద గ్లాసు కూడా లాక్కున్నాడు. కొద్ది సేపటికి అనిల్ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు.

దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించేసరికి శ్రీనివాస శర్మ, సుబ్బలక్ష్మి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. హుటాహుటిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీనివాస శర్మ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సుబ్బలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. పెద్ద కుమారుడు అఖిల్ తాను కూడా పురుగుమందు తాగానని కొద్ది సేపటికి చెప్పడంతో అతనిని కూడా ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంద్రపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
అగ్రహారంలో విషాదఛాయలు
అందరితో కలిసి మెలసిపోయే శ్రీనివాస శర్మ కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అతడు మరణించడంతో ఇంద్రపాలెం అగ్రహారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని సన్నిహితులు, సాటి పురోహితులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. శ్రీనివాస శర్మ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement