ఎవరికి చెప్పి వచ్చారు? | TDP Ward Member Questioned Kimidi Mrunalini | Sakshi
Sakshi News home page

ఎవరికి చెప్పి వచ్చారు?

Nov 3 2017 9:23 AM | Updated on Aug 10 2018 6:49 PM

TDP Ward Member Questioned Kimidi Mrunalini - Sakshi

మృణాళినిని నిలదీస్తున్న టీడీపీ వార్డు మెంబర్‌ సురేష్‌

చీపురుపల్లి: ‘అమ్మా నేను ఈ వార్డు మెంబర్‌ని, మా ప్రాంతంలో ఎవరికి చెప్పి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధిని అయిన నాకు చెప్పనక్కర్లేదని అనుకున్నారా... సమాధానం చెప్పి కదలండి..’ ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్‌ పంచాయతీలోని విజయాకాలనీలో గురువారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీలో ఎమ్మెల్యే కిమిడి మృణాళినిని అదే పార్టీకి చెందిన వార్డు మెంబరు గవిడి సురేష్‌ నిలదీసిన సంఘటన. దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపైనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

గురువారం సాయంత్రం మేజర్‌ పంచాయతీ పరిధిలోని విజయాకాలనీలో ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది తెలుసుకున్న వార్డు మెంబరు సురేష్‌ అక్కడకు చేరుకుని తనకెందుకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీనికి ఆమె సమాధానమిస్తూ మండల పార్టీ అధ్యక్షుడికి చెప్పామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement