గత ప్రభుత్వ పాపం.. ఎంబీసీలకు శాపం | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వ పాపం.. ఎంబీసీలకు శాపం

Published Tue, Oct 1 2019 10:24 AM

TDP Negligence On Most Backward Cast In AP - Sakshi

గత టీడీపీ ప్రభుత్వ పాపం ప్రస్తుతం ఎంబీసీ(మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌)లకు శాపంలా మారింది. వృత్తి రుణాలు తీసుకుని చిన్నపాటి వ్యాపారం చేసుకుని బాగుపడదామని భావించిన ఎంబీసీలకు ఆ నిరాశే మిగిలింది. అందరితో పాటు దరఖాస్తు చేసుకున్నా కొందరికి మంజూరు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

సాక్షి, పలమనేరు(చిత్తూరు) : జిల్లాలో 32 కులాలను ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించింది. వీరు చేసుకునే వృత్తులను బట్టి రూ.30 వేలు (90శాతం రాయితీ) రుణాలను నాన్‌బ్యాంకింగ్, ఆపై లక్షదాకా రుణాలను బ్యాంకింగ్‌ ద్వారా ఇచ్చేందుకు ఆదేశాలిచ్చింది. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలాగైనే బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు నాటి సీఎం చంద్రబాబునాయుడు మంచి పథకాన్నే ఎంచుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలోని 1,800 మంది ఎంబీసీలు ఈ రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఈ రుణాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది.
ఇప్పుడు మళ్లీ దరఖాస్తు
అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ గతంలో జరిగిన అక్రమాలు, ఆపై ఎన్నికల్లో బీసీలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన తతంగాలను గమనించి వాటిని రద్దు చేసింది. ఎంబీసీ రుణాల కోసం అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫలితంగా జిల్లాలోని ఎంబీసీలు మళ్లీ అన్ని ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు.

భారీగా పెరిగిన రుణం
ఈ ప్రభుత్వంలో ఎంబీసీ రుణాలను రూ.30 నుంచి రూ.50 వేలకు పెంచారు. ఈ రుణాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నారు. ఈ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 30వ తేదీ వరకు గడువు పెట్టారు. ఆసక్తి గలవారు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న రుణాలను కావాలనే ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని, నిజమైన అర్హులకు రుణాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement