వివాహితతో టీడీపీ నేతల అసభ్య ప్రవర్తన

TDP Leaders Harassed Married Woman Tadepalli - Sakshi

పోలీసులకు ఫిర్యాదుచేసిన మహిళ

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన 

సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో మహిళలపై టీడీపీ నాయకుల అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. యర్రబాలెంలో టీడీపీ నాయకుల అనుచరులు ఓ యువతిని ఏడిపించిన ఘటన మరువకముందే.. తాడేపల్లిలో వివాహితను టీడీపీ నాయకుడు నమ్మకంగా కారు ఎక్కించుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహానాడు ప్రాంతంలో నివాసముండే ఓ వివాహిత ప్రయివేటు పాఠశాలలో టీచర్‌. టీడీపీ నాయకుడు దానా వేణుగోపాల్‌ అలియాస్‌ డ్రైవర్‌ చిన్న మనవళ్లు కూడా అదే పాఠశాలలో చదువుతున్నారు. వారిని తీసుకెళ్లేందుకు కారులోవచ్చిన వేణుగోపాల్‌.. మార్గంమధ్యలో నడిచి వెళుతున్న టీచర్‌ను బలవంతంగా కారు ఎక్కించాడు.

అనంతరం తన మనవళ్లను దించేసి.. టీచర్‌ను సీతానగరం రామయ్యకాలనీలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. భయపడిన ఆమె.. వెంటనే భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. భర్త వెంటనే రామయ్యకాలనీకి రాగా.. వేణుగోపాల్‌ అక్కడ నుంచి కారును మరో టీడీపీ నాయకుడి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడకూ భర్త చేరుకుని తన భార్యను విడిచిపెట్టాలంటూ ప్రాధేయపడ్డాడు. మరో టీడీపీ నాయకుడు కూడా అసభ్యకరంగా మాట్లాడటంతో బెంబేలెత్తిపోయిన భర్త.. కారు వద్దకు పరుగులుతీశాడు. అంతలో భార్య కారులోంచి కిందకు దూకి భర్తతో కలిసి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top