రవిపై.. సీతారామ బాణం
ప్రజామోదం తమ్మినేనికే..
తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిపత్యం
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్గాలి స్పీడ్కు సైకిల్ అడ్రస్ లేకుండా పోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వైఎస్సార్సీసీ విజయం ఏకపక్షంగా సాగింది. తొలి రౌండ్ నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధిపత్యం కొనసాగించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించగా 1, 8 రౌండ్లలో తప్ప మిగిలిన అన్ని రౌండ్లతో తమ్మినేని సీతారాం స్పష్టమైన మెజార్టీ సాధించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయినప్పటికి తమ్మినేని 77,233 ఓట్లు సాధించగా, కూన రవికుమార్ 63,377 ఓట్లతో సరిపెట్టుకున్నారు. జనసేనకు 3186 ఓట్లురాగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు నాలుగంకెల స్థానాన్ని చేరుకోలేకపోయాయి.
నోటాకు 2637 ఓట్లు రావడం విశేషం. ఏకపక్షంగా సాగిన ప్రజాతీర్పులో సిటింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్లు మెజార్టీతో విజయం సాగించారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం, నవరత్నాలు సీతారాంను విజయ తీరాలకు చేర్చాయి. ఐదేళ్లుగా తమ్మినేని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి తరఫున పోరాటం చేశారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ప్రజల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. దీనికి తోడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి. కాగా గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. నియోజకవర్గంలో కూన ఇసుక దందాలు, భూదందా, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పారు.