మంగళగిరి ఆసుపత్రిలో దారుణం

మంగళగిరి ఆసుపత్రిలో దారుణం - Sakshi


సాక్షి, గుంటూరు: మంగళగిరి పట్టణంలోని ఓ ఆసుపత్రి దారుణానికి ఒడిగట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన ఓ యువతి మృతి చెందినా.. ఆమెకు రెండు రోజుల పాటు వైద్యం చేసినట్లు నటించిన ఘటన ఠాగూర్‌ సినిమాను గుర్తుకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్వరూప అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆమెను హుటాహుటిన మంగళగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.



ఘటన గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీళ్లతో ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స చేస్తున్నామని స్వరూప ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు భరోసానివ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల అనంతరం స్వరూప చనిపోయిందని, మిగిలిన డబ్బు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.


దీంతో నిర్గాంతపోయిన స్వరూప కుటుంబసభ్యులు ఆసుపత్రి తమను మోసం చేసిందని ఆరోపించారు. స్వరూప ముందే మరణించినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా వైద్య అవసరాలకు రూ.1.50 లక్షలు గుంజారని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top