అమృతం కాదు.. విషం | supplying un quality nutrition in balamrutham scheme | Sakshi
Sakshi News home page

అమృతం కాదు.. విషం

Dec 22 2013 12:44 AM | Updated on Sep 2 2017 1:50 AM

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేది నుంచి చిన్నారుల కోసం ‘బాలామృతం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.

జోగిపేట, న్యూస్‌లైన్:  మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేది నుంచి చిన్నారుల కోసం ‘బాలామృతం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా చిన్నారులకు నెల రోజులు పాటు సరిపోయేలా అనుబంధ పౌష్టికాహరంతో కూడిన ప్యాకెట్‌ను ఒక్కొక్కరికి ఒక్క ప్యాకెట్ చొప్పున అందజేయాలి. ప్రతి రోజు 100 గ్రాముల చొప్పున 7-36 నెలల  పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో 7 వేల మంది చిన్నారులను గుర్తించి రెండు, మూడు రోజుల క్రితం అంగన్‌వాడీ కేంద్రాలకు ప్యాకెట్‌లను పంపిణీ చేశారు.

అయితే జోగిపేటకు చెందిన రెండు కేంద్రాల్లో శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకెట్‌లను పంపిణీ చేయగా, అందులో నుంచి తెల్లటి పురుగులు బయటపడడంతో ప్యాకెట్‌లు తీసుకున్న వారు తిరిగి తీసుకువచ్చి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చేశారు. సర్కార్ పంపిణీ చేసిన ప్యాకెట్‌లోని పొడి తాగిన స్థానిన ఎస్సీ కాలనీలోని చిన్నారి  వాంతులు చేసుకుంది. మరో కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త తన బిడ్డకు ఈ పొడిని కలిపి తాగించిన వెంటనే ఆ చిన్నారి వాంతులు చేసుకున్నట్లు సమాచారం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం వారిని అనారోగ్యానికి గురి చేస్తుండడంతో వాటిని పిల్లలకు పంపిణీ చేసేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. మరోవైపు ‘బాలామృతం’ ప్యాకెట్‌లలో పురుగులు వస్తున్న విషయం తెలుసుకున్న తల్లులు ఈ ప్యాకెట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement