జగన్ యాత్రతో బాబుకు దిమ్మతిరగడం ఖాయం


=మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 =రేపు కుప్పం నుంచి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర

 =అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపు


 

 పీలేరు, న్యూస్‌లైన్:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే సమైక్య శంఖారావంతో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు దిమ్మతిరగడం ఖాయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. శనివారం కుప్పం నుంచి ప్రారంభించనున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



గురువారం పీలేరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణవార్త విని గుండెపగిలి చనిపోయిన కుటుంబాలను జగన్ ఓదారుస్తారని తెలిపారు. అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్య వాదులు వేలాదిగా తరలివచ్చి యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యాత్రను అడ్డుకునే విధంగా ప్రజలను రెచ్చగొట్టడం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దిగజారు డు తనానికి నిదర్శనమన్నారు. తనస్థాయి మరచి వార్డు సభ్యునికన్నా హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.



జగన్ సమైక్య యాత్ర రాయలసీమతో పాటు తెలంగాణ , కొస్తాంధ్రలోనూ సాగుతుందన్నారు. ఆయన యాత్రను చూసి చంద్రబాబుకు దిమ్మతిరగడం ఖాయమన్నారు. జగన్‌తోనే రాజన్న సువర్ణ యుగం సాధ్యమన్నారు. సీఎం కిరణ్, చంద్రబాబులు ఇక ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని, వచ్చే ఎన్నికల్లో ఇరువురూ తట్టాబుట్టా సర్దుకోక తప్పదని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలూ ఎన్ని అవాంతరాలు సృష్టిం చినా కాబోయే సీఎం జగనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డాక్టర్ లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు.



ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ కదిరి వెంకట్రామయ్య, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ ఓ.లక్ష్మీనారాయణ, బీడీ.నారాయణరెడ్డి, షామియాన షఫీ, రమేష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, జనార్దన్‌రెడ్డి, ఎల్‌ఐసీ ద్వారకనాథరెడ్డి, చక్రపాణిరెడ్డి, కేశవరెడ్డి, చినబాబు, భాస్కర్‌రెడ్డి, విక్టరీ వెంకట్రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, సదుం నాగరాజ, కాలనీ చిన్న, ఉదయ్‌కుమార్, పూల కుమార్, కత్తి రామలింగారెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

 సమైక్య శంఖారావానికి తరలిరండి

 పుత్తూరు: జగన్ చేపట్టనున్న సమైక్య శంఖారావానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి పిలుపునిచ్చారు. గురువారం పుత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. జగన్ యాత్రతో టీడీపీ కంచుకోట బద్ధలవడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు ఇచ్చిన లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top