
సొసైటీల్లో రూ.1,180 కోట్ల బకాయిలు
జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలకు రూ.1,180 కోట్ల రుణాలను రైతులు చెల్లించాల్సి ఉందని డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం వెల్లడించారు. తాడేపల్లిగూడెం డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయంలో
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలకు రూ.1,180 కోట్ల రుణాలను రైతులు చెల్లించాల్సి ఉందని డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం వెల్లడించారు. తాడేపల్లిగూడెం డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయంలో సబ్డివిజన్ పరిధిలోని సొసైటీ అధికారులతో రైతుల బకాయిలపై గురువారం ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం సొసైటీల ద్వారా రుణం తీసుకున్న రైతులకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు రుణాలు చెల్లింకపోవడం వల్ల వారు ఇప్పటికే జీరో వడ్డీ రాయితీని కోల్పోయారన్నారు. జూలై 31 లోపు చెల్లించిన వారికి 6శాతం వడ్డీ రాయితీ వర్తించిందన్నారు.
రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది రైతులు బకాయిలు కట్టకపోవడం వల్ల ఈ ఆరుశాతం వడ్డీరాయితీ కూడా లభించలేదన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్లి గడువును ఈనెలాఖరువరకు పొడింగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రుణాలు చెల్లించిన వారికి కూడా మాఫీ వర్తిస్తుందన్నారు. సొసైటీలో రుణం తీసుకున్న రైతుకు రూ.1.50 లక్షల వరకు మాఫీ అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో భీమవరం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్లలో రైతులకు రుణాల చెల్లింపుపై త్వరలో అధికారుల ద్వారా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఆయన వెంట సీఈవో వీవీఎన్ ఫణికుమార్, కొవ్వూర్ డివిజన్ అధికారి శ్రీనివాస్, సొసైటీ కార్యదర్శులు పాల్గొన్నారు.