సీమాంధ్రలో భద్రత పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్‌లు | Senior IPS Officers for Monitoring Seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో భద్రత పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్‌లు

Dec 5 2013 3:45 AM | Updated on Aug 18 2018 4:13 PM

సీమాంధ్ర జిల్లాల్లో భద్రతాచర్యలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కేటాయిస్తూ డీజీపీ ప్రసాదరావు ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో భద్రతాచర్యలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కేటాయిస్తూ డీజీపీ ప్రసాదరావు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, రీజియన్ ఐజీలు ఉన్నప్పటికీ సీనియర్ అధికారులను జిల్లాలకు పంపారు. రీజియన్ ఐజీలు ఖచ్చితంగా ఆ రీజియన్‌లోనే ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు ఆయా జిల్లాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడతారనే సమాచారం నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
 
 12వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంకానున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందనే విషయంపై కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, విద్యార్ధి, యువజన జేఏసీలు ఆందోళనలకు ప్రణాళికను ప్రకటించాయి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి హోంమంత్రి  చిదంబరంచేసిన ప్రకటనకు నిరసనగా 9వ తేదీని విద్రోహ దినంగా ప్రకటించాలని ఇప్పటికే అన్ని జేఏసీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే  24 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement